దక్షిణాసియా ప్రాంతానికి ప్రపంచబ్యాంకు జూన్ 30తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 6.6 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం అందించింది. ఇందులో భారత్కే ఎక్కువ ఆర్థిక సాయం అందింది. మొత్తం నిధుల్లో భారత్కు 2,242 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయం అందింది.
అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం ప్రభావం నుంచి ప్రపంచదేశాలను బయటపడేసే చర్యల్లో భాగంగా ప్రపంచబ్యాంకు దక్షిణాసియా ప్రాంతానికి ఈ ఆర్థిక సాయం అందజేసింది. భారత్లోని చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ఆర్థిక లభ్యతను పెంచేందుకు ప్రపంచబ్యాంకు అదనంగా మరో 400 మిలియన్ డాలర్ల రుణాన్ని ఇచ్చింది.
ఆర్థిక మాంద్యం కారణంగా చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు రుణ లభ్యత బాగా కష్టమైన నేపథ్యంలో.. ప్రపంచబ్యాంకు ఈ సాయం చేసింది. దక్షిణాసియాలో ప్రపంచబ్యాంకు రుణాన్ని ఎక్కువగా పొందిన రెండో దేశం పాకిస్థాన్.
పాకిస్థాన్కు ప్రపంచబ్యాంకు 1,609 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని అందజేసింది. మూడో స్థానంలో ఉన్న బంగ్లాదేశ్కు ప్రపంచబ్యాంకు నుంచి 1,096 మిలియన్ డాలర్ల రుణం అందింది. ఇదిలా ఉంటే పాకిస్థాన్కు దేశంలో ఆర్థిక స్థిరత్వం కోసం ప్రపంచబ్యాంకు మరో 500 మిలియన్ డాలర్ల రుణం అందజేసింది.
అంతకుముందు ఏడాదితో పోలిస్తే ప్రపంచబ్యాంకు ఈ ఏడాది తన సాయాన్ని 1.1 బిలియన్ డాలర్లు పెంచింది. పేదరిక నిర్మూలన, ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు, ప్రైవేట్ వ్యాపారాలకు చేయూత కార్యక్రమాలకు సంబంధించిన 89 ప్రాజెక్టుల్లో ప్రపంచబ్యాంకు ఈ నిధులను పెట్టుబడిగా పెట్టింది. అంతేకాకుండా మౌలికసదుపాయాల ప్రాజెక్టులపై 2 బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడి పెట్టింది.