ఐపీఎల్ సందడి నేటి నుంచే... వాంఖడే స్టేడియంలో ప్రారంభం

శనివారం, 7 ఏప్రియల్ 2018 (08:15 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సందడి శనివారం నుంచి ప్రారంభంకానుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఐపీఎల్ ప్రారంభ వేడుకలు అట్టహాసంగా జరుగనున్నాయి. ప్రపంచంలోనే ధనిక క్రీడా సంస్థల్లో ఒక్కటైన భారతీయ క్రికెట్ కంట్రోల్ బోర్డుకు కాసులు కురిపించే క్రికెట్ పండగ ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా సాయంత్రం 6:15 నిమిషాలకు ప్రారంభం కానున్నాయి. 7:30కు తొలి మ్యాచ్‌కి టాస్ వేస్తారు. 
 
ఈ ఆరంభ వేడుకల్లో బాలీవుడ్ నటులు హృతిక్‌ రోషన్, వరుణ్‌ ధావన్‌, జాక్విలిన్ ఫెర్నాండెస్, తమన్నా భాటియాలతో పాటు, ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా, సింగర్ మీకా సింగ్ ఆడిపాడనున్నాడు. 
 
ఇకపోతే, తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌తో, రెండేళ్ల తర్వాత పునరాగమనం చేసిన చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. మ్యాచ్‌లను స్టార్ ఇండియా ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. వివిధ భాషల్లో ప్రత్యక్ష ప్రసారానికి ఏర్పాట్లు చేశారు. హాట్ స్టార్, డీడీ స్పోర్ట్స్‌లో ఐదు నిమిషాలు ఆలస్యంగా మ్యాచ్ ప్రసారం కానుంది. డీడీ స్పోర్ట్స్‌లో ప్రసారం కానుండటం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 
 
కాగా, గత దశాబ్దకాలంగా క్రికెట్ ప్రేమికులను ఎంతగానో ఆలరిస్తూ వస్తున్నాయి. దాదాపు నెలన్నర పాటు ఈ పోటీలు ఆలరించనున్నాయి. ఈ పోటీలు జరిగే సమయంలో సినిమా థియేటర్లు, క్రీడా మైదానాలు, ఇతర వినోద కార్యక్రమాలన్నీ వెలవెలబోతాయి. 

 

 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు