డేవిడ్ వార్నర్ 50:50 : ఖాతాలో అరుదైన రికార్డు (Video)

శుక్రవారం, 9 అక్టోబరు 2020 (09:39 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీ జట్లలో ఒకటైన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈయన ప్రస్తుతం యూఏఈ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ టోర్నీ 13వ సీజన్ పోటీల్లో అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. 
 
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో 50 సార్లు 50కిపైగా పరుగులు చేసిన తొలి బ్యాట్స్‌మన్‌గా రికార్డులకెక్కాడు. గురువారం రాత్రి కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో వార్నర్ 40 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్‌తో 52 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ 69 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
 
ఐపీఎల్‌ టోర్నీలో డేవిడ్ వార్నర్ గత 2009 నుంచి క్రమం తప్పకుండా ఆడుతున్నారు. పైగా, అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా మూడు సీజన్లలో ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. బాల్ ట్యాంపరింగ్ వివాదం కారణంగా 2018లో సీజన్‌లో ఐపీఎల్‌కు దూరమయ్యాడు. 
 
నిషేధం పూర్తికావడంతో గతేడాది మళ్లీ జట్టులో చేరాడు. గత సీజన్‌లో 12 మ్యాచుల్లో 692 పరుగులు చేసి మూడోసారి ఆరెంజ్ క్యాప్‌ అందుకున్నాడు. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో వార్నర్ చేసిన అర్థ సెంచరీతో 50సార్లు ఈ ఘనత సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.
 
పంజాబ్‌పై వార్నర్‌కు ఇది 9వ అర్థ సెంచరీ కావడం గమనార్హం. వార్నర్ ఐపీఎల్‌లో ఇప్పటివరకు 46 అర్థ సెంచరీలు నమోదు చేయగా, నాలుగు సెంచరీలు ఉన్నాయి. వార్నర్ తర్వాత ఈ జాబితాలో బెంగళూరు సారథి విరాట్ కోహ్లీ ఉన్నాడు. 
 
కోహ్లీ 42సార్లు 50కిపైగా పరుగులు చేశాడు. రోహిత్ శర్మ, సురేశ్ రైనాలు 39 సార్లు ఈ ఘనత సాధించగా, డివిలియర్స్ 38సార్లు 50కిపైగా పరుగులు చేసి ఆ తర్వాతి స్థానంలో ఉన్నాడు. 

 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు