షార్జాలో పరుగుల ప్రవాహం : 208 పరుగులు చేసిన ముంబై ఇండియన్స్

ఆదివారం, 4 అక్టోబరు 2020 (18:59 IST)
ఐపీఎల్ 2020 టోర్నీలో భాగంగా ఆదివారం ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేపట్టిన ముంబై ఇండియన్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 208 పరుగుల చేసింది. ఆ జట్టు ఓపెనర్ క్వింటన్ డికాక్ 39 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సులతో 67 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
 
ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ 27, ఇషాన్ కిషన్ 31, హార్దిక్ పాండ్య 28, పొలార్డ్ 25, కృనాల్ 4 బంతుల్లో 20 పరుగులు సాధించారు. సిద్ధార్థ్ కౌల్ వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్లో కృనాల్ ఏకంగా రెండు సిక్సులు, రెండు ఫోర్లు బాదడంతో ముంబయి స్కోరు 200 దాటింది. అంతకుముందు ఆరంభంలో కెప్టెన్ రోహిత్ శర్మ (6) నిరాశపరిచాడు.
 
కాగా, బ్యాటింగ్‌కు స్వర్గధామం వంటి ఈ స్టేడియంలో ఇప్పటివరకు ఆడిన ఐపీఎల్ మ్యాచ్‌లో భారీస్కోర్లు నమోదయ్యాయి. ఛేజింగ్ చేసిన జట్లు కూడా 200 పరుగుల మార్కు దాటించాయి. ఈ నేపథ్యంలో సన్ రైజర్స్ బ్యాట్స్ మెన్ ఎలా స్పందిస్తారో చూడాలి. 
 
అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇన్నింగ్స్‌ను పేలవంగా ఆరంభించింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఇన్నింగ్స్‌ మొదటి ఓవర్‌లోనే వెనుదిరిగాడు. సందీప్‌ శర్మ బౌలింగ్‌లో నాలుగో బంతిని భారీ సిక్సర్‌ బాదిన హిట్‌మ్యాన్‌ తర్వాతి బంతికే వికెట్‌ కీపర్‌ బెయిర్‌స్టోకు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. 
 
ఆ తర్వాత వన్డౌన్‌లో వచ్చిన సూర్యకుమార్‌ యాదవ్‌(27) ఎక్కువసేపు నిలువలేదు. ఈ దశలో ఇషాన్‌ కిషన్‌, డికాక్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. డికాక్‌ చెలరేగుతుండగా ఇషాన్‌ అతనికి మద్దతుగా నిలిచాడు. అబ్దుల్‌ సమద్‌ వేసిన ఏడో ఓవర్లో ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న డికాక్‌... భారీ షాట్లతో విరుచుకుపడుతూ ఫోర్లు, సిక్స్‌లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఫలితంగా ముంబై ఇండియన్స్ భారీ స్కోరు చేసింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు