ఐపీఎల్ కిక్ అంటే అదే మరి.. అందుకే ప్రపంచంలో ఐపీఎల్ బెస్ట్ లీగ్

సోమవారం, 28 సెప్టెంబరు 2020 (12:12 IST)
ప్రపంచంలో ఎన్నో క్రికెట్ లీగ్‌లు ఉన్నాయి. బీసీసీఐ నిర్వహించే ఐపీఎల్ అంటే చాలు క్రికెట్ ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా గమనిస్తూ వుంటుంది. ప్రతి ఒక్క క్రికెటర్ ఐపీఎల్ ఆడితే చాలు అని అనుకుంటూ ఉంటారు. అందుకు తగ్గట్టుగా కొన్ని మ్యాచ్‌లు కూడా ఎంతో రసవత్తరంగా సాగుతూ ఉంటాయి. పంజాబ్‌, రాజస్థాన్ మ్యాచ్‌ కూడా అలాంటిదే. 
 
షార్జా స్టేడియంలో అసలైన సిక్సర్ల వర్షాన్ని చూశారు. మరో 3 బంతులు మిగిలి ఉండగానే రాజస్థాన్ రాయల్స్ విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌పై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందించారు. ఇదో అద్భుత మ్యాచ్ అని, అందుకే ప్రపంచంలో ఐపీఎల్ బెస్ట్ లీగ్ అని ఆయన తన ట్విట్టర్‌లో తెలిపారు. 
 
రాజస్థాన్ రాయల్స్, కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్ల మధ్య జరిగిన భారీ స్కోరింగ్ మ్యాచ్ ఎన్నో ట్విస్టులతో సాగిన సంగతి తెలిసిందే. 224 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ మ్యాచ్‌ను ఊహించని స్థాయిలో ముగించేసిందని గంగూలీ గుర్తు చేశారు. 
 
ఈ మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్ మొత్తం 34 ఫోర్లు, 29 సిక్సర్లు బాదారు. పంజాబ్ బ్యాట్స్‌మెన్ మయాంక్ అగర్వాల్ 107 పరుగులు చేయగా.. రాజస్థాన్ జట్టులో స్మిత్‌, తెవాటియా, శాంసన్‌లు హాఫ్ సెంచరీలతో విజయానికి బాటలు వేశారు. రాహుల్ తెవాటియా ఇన్నింగ్స్ మ్యాచ్‌కు హైలైట్‌గా నిలిచింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు