కోహ్లీ అసహనం... మ్యాచ్ రిఫరీ మందలింపుతో సరి...

గురువారం, 15 ఏప్రియల్ 2021 (09:35 IST)
స్వదేశంలో కరోనా వైరస్ మహమ్మారి సంక్రమణ శరవేగంగా సాగుతున్నప్పటికీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 14వ సీజన్ పోటీలు మాత్రం సాఫీగా సాగిపోతున్నాయి. ఈ పోటీల్లో భాగంగా, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు సారథి విరాట్‌ కోహ్లీ మందలింపునకు గురయ్యాడు. 
 
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచులో అతడు ఐపీఎల్‌ నియమావళిని ఉల్లంఘించడమే ఇందుకుకారణం. ఈ మ్యాచులో విరాట్‌ 29 బంతుల్లో 4 బౌండరీల సాయంతో 33 పరుగులు చేశాడు. 
 
స్కోరు వేగం పెంచే క్రమంలో జేసన్ హోల్డర్‌ వేసిన 12.1వ బంతిని అతడు భారీ షాట్‌ ఆడాడు. బ్యాటు అంచుకు తగిలిన బంతి గాల్లోకి లేచింది. లాంగ్‌ లెగ్‌లో ఉన్న ఫీల్డర్‌ విజయ్‌ శంకర్‌ వేగంగా పరుగెత్తుకుంటూ వచ్చి డైవ్‌ చేసి ఆ క్యాచ్‌ను అద్భుతంగా ఒడిసిపట్టాడు.
 
ఔటైన ఆవేశంలో కోహ్లీ వేగంగా క్రీజ్‌ను వీడాడు. ఈ క్రమంలో అతడు అడ్వర్టైజ్‌మెంట్‌ కుషన్‌, కుర్చీని తన్నేశాడు. అతడు ఐపీఎల్‌ నియమావళిలోని లెవల్‌ 1 నిబంధనలను ఉల్లంఘించినట్లు అభియోగాలు నమోదయ్యాయి. 
 
దాంతో రిఫరీ వెంగలిల్‌ నారాయణ్‌ కుట్టీ ఆర్‌సీబీ  కెప్టెన్‌ను మందలించాడు. కాగా 2016లో ఇదే బెంగళూరుతో మ్యాచులో గౌతమ్‌ గంభీర్‌ ఇలాగే చేయడంతో అతడి మ్యాచు ఫీజులో 15 శాతం కోత విధించడం గమనార్హం. ఆర్‌సీబీ 149 పరుగులే చేసినప్పటికీ 6 పరుగుల తేడాతో విజయం సాధించడం గమనార్హం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు