ఐపీఎల్ వద్దనే వద్దంటూ సీఎంకు లేఖ... ముంబైలో మ్యాచ్‌లు జరిగేనా?

గురువారం, 8 ఏప్రియల్ 2021 (18:45 IST)
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)కు కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టోర్నీ 14వ సీజన్ శుక్రవారం నుంచి ప్రారంభంకానుంది. ఈ సీజన్ తొలి మ్యాచ్ మొదటి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ ముంబై ఇండియన్స్..‌ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో తలపడనుంది. 
 
అయితే, ఈ టోర్నీలో పాల్గొనే క్రికెటర్లకు కరోనా సెగ తగలకుండా ప్రత్యేక నిబంధనలను అవలంభింస్తోంది. ఆటగాళ్లను బయోబబుల్‌లో ఉంచడం, స్టేడియాలకు ప్రేక్షకులను నిషేధించడం తదితర రూల్స్‌ను కఠినంగా అమలు చేస్తోంది. 
 
అంతేకాకుండా మ్యాచ్‌ల కోసం దేశంలోని 6 మైదానాలను మాత్రమే ఎంపిక చేసింది. వాటిలో ముంబైలోని ప్రముఖ వాంఖడే స్టేడియం కూడా ఒకటి. అయితే, ప్రస్తుతం కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తున్న తొలి రాష్ట్రంలో మహారాష్ట్ర ఉంది. ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఈ ఒక్క రాష్ట్రంలోనే అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. 
 
వేల సంఖ్యలో ప్రజలు కరోనా బారిన పడుతున్నారు. ఈ క్రమంలోనే వాంఖడే సమీపంలోని ప్రజలు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేకు ఓ లేఖ రాశారు.  ఐపీఎల్ మ్యాచ్‌లను ముంబైలో నిర్వహించవద్దంటూ ఆ లేఖలో కోరారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో ఇక్కడ మ్యాచ్‌లు నిర్వహిస్తే పరిస్థితులు మరింత చేజారే దుస్థితి ఏర్పడవచ్చని ఆ లేఖలో రాసుకొచ్చారు. 
 
స్టేడియంలోకి ప్రేక్షకులకు అనుమతి లేకపోయినా, ఆటగాళ్లు వేదిక చేరుకున్నాక తమ అభిమాన ఆటగాడిని చూడాలనే ఆశతో ప్రజలు స్టేడియం బయట గూమికూడే అవకాశం ఉందని, తద్వారా కరోనా మరింత పెరిగే ప్రమాదం ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. 
 
వివాహాలు, మరణాలు మొదలైన మతపరమైన, ఇతర సామాజిక కార్యకలాపాల విషయంలో ఆంక్షలు విధించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లకు మాత్రం ఎలా అనుమతినిస్తుందని తమ లేఖతో మహారాష్ట్ర సర్కార్‌ను నిలదీశారు. మరిదీనిపై మహారాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు