'ఐపీఎల్‌'కు కరోనా భయం ... యధావిధిగా టోక్యో ఒలింపిక్స్

శుక్రవారం, 13 మార్చి 2020 (14:51 IST)
విశ్వాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ దెబ్బకు అనేక క్రీడా సంగ్రామాల నిర్వహణ వాయిదాపడుతున్నాయి. ఆ కోవలోనే ఇపుడు స్వదేశంలో జరగాల్సిన ఐపీఎల్ 2020 పోటీలు కూడా వాయిదాపడ్డాయి. నిజానికి ఈ నెల 29వ తేదీ నుంచి ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఐపీఎల్ ప్రారంభోత్సవ తొలి మ్యాచ్ జరగాల్సివుంది. కానీ, కరోనా వైరస్ భయభ్రాంతులకు గురిచేస్తుండటంతో నిర్వహాకులు ఈ ప్రారంభోత్సవ వేడుకలను వాయిదావేశారు. 
 
ఈ కరోనా వైరస్ కారణంగా క్రీడా రంగం కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతోంది. ఈ కారణంగానే అనేక పోటీలు వాయిదాపడుతున్నాయి. దీంతో కరోనా ప్రభావం కారణంగా ప్రేక్షకులు లేకుండానే ఐపీఎల్ నిర్వహించాలని బీసీసీఐ తొలుత భావించింది. కానీ, ఇపుడు మనసు మార్చుకుంది. 
 
ఐపీఎల్ ప్రారంభ తేదీని వాయిదా వేసింది. ముందు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఐపీఎల్ తాజా సీజన్ మార్చి 29న ప్రారంభం కావాలి. అయితే భారత్‌లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతుండడంతో స్టేడియాల్లోకి జనసమూహాలను అనుమతించడం మహమ్మారి వ్యాప్తికి ఊతమిచ్చినట్టు అవుతుందని భావించారు. దాంతో ఐపీఎల్ ప్రారంభాన్ని ఏప్రిల్ 15కి వాయిదా వేశారు. అప్పటికీ కరోనా అదుపులోకి రాకపోతే ఆపై తదుపరి నిర్ణయం తీసుకుంటారు. 
 
యధావిథిగా టోక్యో ఒలింపిక్స్
మరోవైపు, టోక్యో ఒలింపిక్స్ నిర్వహణపై అనుమానాలు నెలకొన్నప్పటికీ.. షెడ్యూల్ ప్రకారమే విశ్వక్రీడలను మొదలు పెట్టాలని జపాన్ ప్రభుత్వం భావిస్తోంది. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం మెగా ఈవెంట్‌ను కనీసం ఏడాది పాటు వాయిదా వేయాలని చెబుతున్నా.. తమకు ఆ ఉద్దేశమే లేదని జపాన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి యొషిహిడే సుగా శుక్రవారం స్పష్టంచేశారు.
 
'అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఏం మాట్లాడారో నాకు తెలుసు. అయితే, ఒలింపిక్స్‌ను ప్రణాళిక ప్రకారం నిర్వహించేందుకు మేం అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ)తో కలిసి పని చేస్తున్నాం' అని ప్రకటించారు.  
 
జపాన్‌ ప్రధాన మంత్రి షింజో అబేతో శుక్రవారం ఆయన ఫోన్లో మాట్లాడారు. కరోనా ప్రభావం దృష్ట్యా ఒలింపిక్స్‌ను ఒక ఏడాది పాటు వాయిదా వేయాలని ట్రంప్‌ సూచించారు. కానీ, టోక్యో ఒలింపిక్స్‌ వాయిదా గురించి గానీ, ప్రేక్షకులను అనుమతించకుండా క్రీడలను నిర్వహించాలని గానీ ఇద్దరు నేతల మధ్య చర్చ జరగలేదని జపాన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి నవొకి ఒకాడ తెలిపారు.
 
కరోనా వైరస్‌పై యుద్ధంలో గెలిచి, ఒలింపిక్స్‌ను విజయవంతంగా నిర్వహించాలని తమ ప్రధాని దృఢ సంకల్పంతో ఉన్నారని చెప్పారు. ఈ విషయం గురించి తాను కూడా ఆలోచిస్తానని ట్రంప్ అన్నారని తెలిపారు. జపాన్‌, అమెరికా మధ్య ప్రయాణ ఆంక్షల గురించి కూడా ట్రంప్‌, షింజో చర్చించలేదని పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు