ఆధునిక క్రికెట్లో అద్వితీయ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ఐపీఎల్ టోర్నీ ప్రాభవాన్ని, అది సాధించిన ఘనవిజయాన్ని ప్రశంసల వర్షంతో ముంచెత్తాడు. పదేళ్ల క్రితం మామూలుగా మొదలైన ఒక టోర్నీ భారత్లో ఇంత ప్రజాదరణ పొందుతుందని తాను కలలో ఊహించలేదని సచిన్ పేర్కొన్నాడు. హైదరాబాద్లో మొదలైన ఐపీఎల్-10 ప్రారంభోత్సవ కార్యక్రమంలో సమకాలీన భారత క్రికెట్ దిగ్గజాలు గంగూలీ, లక్ష్మణ్, సెహ్వాగ్లతో కలిసి పాల్గొన్న సచిన్ భారత్కి గర్వకారణమైన టోర్నీగా ఐపీఎల్ని అభివర్ణించాడు.
ప్రపంచమంతా ఈ టోర్నీని గుర్తించిందంటే ఇది భారత్కు గర్వకారణమే. క్రికెటంటే తెలియని దేశాలకు ఐపీఎల్ క్రికెట్ను పరిచయం చేసింది. భారత్కే గర్వకారణమైన టోర్నీ ఇది. 2008లో తొలిసారి ఐపీఎల్ ఆడుతున్నప్పుడు ఈ స్థాయిలో విజయం సాధిస్తుందని వూహించలేదు. ఈ టోర్నీ పదేళ్లు పూర్తి చేసుకుందంటే నమ్మలేకపోతున్నా. అభిమానులు, ప్రేక్షకుల మద్దతు లేకుండా ఇది సాధ్యమయ్యే విషయం కాదు అని సచిన్ ఐపీఎల్ పదేళ్ల ప్రస్థానాన్ని, భారత్కు అది తీసుకువచ్చిన ప్రపంచ స్థాయి గుర్తింపును అబినందించాడు. ప్రారంభోత్సవ సందర్భంగా సచిన్, గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్లను బీసీసీఐ సన్మానించింది.
హైదరాబాద్లో ఐపీఎల్-10 ప్రారంభ వేడుకలు ఘనంగా జరిగాయి. తొలి మ్యాచ్కు అభిమానులు పోటెత్తారు. సాయంత్రం 6.30 గంటలకు ఆరంభోత్సవం కాగా.. 4 గంటల నుంచే అభిమానులు హైదరాబాద్ స్టేడియానికి వచ్చారు. 38,000 సామర్థ్యం గల స్టేడియం 7 గంటలకల్లా నిండిపోయింది. ప్రారంభ వేడుకల్లో ప్రముఖ సినీ హీరోయిన్ అమీజాక్సన్ ఆడి పాడింది. లెజెండ్ క్రికెటర్లుగా ఖ్యాతి పొందిన సచిన్, గంగూలీ, లక్ష్మణ్, సెహ్వాగ్లను బీసీసీఐ సన్మానించింది. సన్ రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మధ్య జరిగిన మొదటి మ్యాచ్కి పెద్ద సంఖ్యలో, సుమారు నలభై వేల మంది ప్రేక్షకులు హాజరయ్యారు.