పవిత్ర 'రోజా' ఉపవాసవ్రతం

ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్ ప్రకారం రంజాన్ నెలలో విధిగా ఆచరించవలసిన నియమం ' ఉపవాసవ్రతం' . ఈ ఉపవాస వ్రతాన్ని పార్సీ భాషలో ' రోజా ' అని అంటారు. అరబ్బీ భాషలో ' సామ్ ' అని పిలుస్తారు. ఈ ఉపవాస విధిని రంజాన్ మాసం ప్రారంభమైన నాటి నుండి ముగిసేవరకూ ముస్లింలు పగలు నిష్టగా' రోజా ' ఉపవాస దీక్షలను పాటిస్తారు.

కేవలం ఆహార పానీయాలను మానివేయడం మాత్రమే 'రోజా ' కాదు. నిష్టనియమాలతో కూడుకున్న జీవన విధానం అది. తెల్లవారుజామున భోజనం చేసిన తరువాత ఆ రోజంతా ఉపవాసం ఉండే భక్తులు సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత దీక్షను విరిమిస్తారు. తెల్లవారుజామున ఆహారం తీసుకోవడాన్ని ' సహర్" అనీ, సాయంత్రం ఉపవాస వ్రతదీక్ష విరమణలో తీసుకునే ఆహారాన్ని ' ఇఫ్తార్' అని అంటారు.

అంటే రంజాన్ నెలలో ప్రతిరోజు సూర్యోదయం పూర్వం నుంచి సూర్యాస్తమయం వరకు సుమారు 13 గంటలుపాటు కఠిన ఉపవాసదీక్షలు పాటిస్తారు. ఉపవాసదీక్ష పాటించేవారు అబద్దం ఆడకుండా, పరనిందకు పాల్పడకుండా గడపడంతో పాటూ, శారీరక, మానసిక వాంఛలకు దూరంగా, నిగ్రహంతో వుంటూ ఆసాంతం దైవచింతనతో గడుపుతూ వుంటారు. ఈ ఉపవాస దీక్ష లక్ష్యం మనిషిలో దైవభీతి, దేవుడిపట్ల నమ్మకం మొదలైన మహత్తరమైన సుగుణాలను పెంపొందింపజేయడమే! దీనిని ఖురాన్ ' తఖ్వా' అని అంటుంది.

వెబ్దునియా పై చదవండి