నేడు గల్ఫ్‌లో... రేపు భారత్‌లో రంజాన్ పండుగ

గురువారం, 13 మే 2021 (08:59 IST)
ఈద్‌-ఉల్‌-ఫితర్‌ (రంజాన్) దేశవ్యాప్తంగా శుక్రవారం జరగనుంది. బుధవారం నెల వంక కనిపించకపోవడంతో గురువారం రంజాన్‌ ఉపవాస దీక్షను కొనసాగించాలని, 14వ తేదీన ఈద్‌ జరుపుకోవాలని రువాయత్‌-ఎ-హిలాల్‌ కమిటీ, ఢిల్లీలోని జామా మసీదు ఇమామ్‌తో పాటు పలువురు మత పెద్దలు ప్రకటించారు. గల్ఫ్‌ దేశాల్లో రంజాన్‌ పండుగను గురువారం జరుపుకుంటున్నారు. 
 
అదేసమయంలో దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి నియంత్రణ చర్యల్లో భాగంగా అనేక రాష్ట్రాల్లో లాక్డౌన్ అమలవుతోంది. దీంతో ఈద్‌ ప్రార్థనల కోసం ఈద్గాలు, మసీదులకు వెళ్లరాదని తెలంగాణ వక్ఫ్‌ బోర్డు స్పష్టం చేసింది. 
 
నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని మసీదుల మేనేజింగ్‌ కమిటీలను వక్ఫ్‌ బోర్డు హెచ్చరించింది. కరోనా విజృంభణ నేపథ్యంలో ముస్లింలంతా ఈద్‌ ప్రార్థనలను ఇళ్లలోనే జరుపుకోవాలని జామియా నిజామియా ప్రతినిధులు కూడా సూచించారు. 
 
మరోవైపు, కరోనా వైరస్ కేసులు అధికంగా నమోదవుతున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. అయితే, కరోనా వైరస్ వ్యాప్తితో పాటు.. కరోనా కర్ఫ్యూ దృష్ట్యా రంజాన్‌ పండుగ మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. 
 
డిప్యూటీ సీఎం అంజద్ బాషా ఈ మార్గదర్శకాలను విడుదల చేశారు. సాధ్యమైనంత వరకూ ఇళ్లలోనే ప్రార్థనలు నిర్వహించుకోవాలని సూచించారు. ఒకవేళ మసీదుకు హాజరు అయితే మాత్రం 50 మందికి మించకూడదని అంజద్ బాషా వెల్లడించారు.
 
ఏపీ సర్కారు రిలీజ్ చేసిన రంజాన్ పండుగ మార్గదర్శకాలను ఓసారి పరిశీలిస్తే, బహిరంగ ప్రదేశాలు, ఈద్గాల్లో ప్రార్థనలు నిషేధించారు. ఉదయం 6 నుంచి 12 వరకు మాత్రమే ప్రార్థనలు నిర్వహించుకునేందుకు అనుమతించారు. 
 
ప్రతి ఒక్కరూ సాధ్యమైనంత వరకూ ఇంట్లోనే ప్రార్థనలు చేసుకోవాలని కోరారు. మసీదులో 50 మందికి మించి ప్రార్థనలకు హాజరు కావొద్దని హెచ్చించారు. ప్రార్థన సమయంలో తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటించాలని, చిన్నపిల్లలు, వృద్ధులు, దగ్గు, జలుబు లక్షణాలు ఉన్నవారు ప్రార్థనలకు వెళ్లకుండా చూడాలని కోరింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు