అంతరిక్షంలో అద్భుతాలు సృష్టిస్తున్న నేటి కాలంలోనూ అమాయక జనం మూఢనమ్మకాలతో బాబాలను ఆశ్రయిస్తున్నారు. మహబూబ్నగర్ జిల్లాలో ఓ వ్యక్తి బాబా అవతారమెత్తి కాళ్ల నొప్పుల నుంచి క్యాన్సర్ వ్యాధి దాకా ఎటువంటి భయంకర వ్యాధినైనా మాయం చేస్తానని నమ్మబలుకుతున్నాడు.
బాబా అవతారానికి ముందు డబ్బాల ఖాసింగా పిలువబడిన ఇతగాడు అనంతపురం జిల్లాలోని పాలమూరుజిల్లాలోని గేదెలు ఎద్దు కొమ్ముల వ్యాపారం చేస్తుండేవాడు. దీంతో అతనికి చుట్టుప్రక్కల చాలామంది ప్రజలు పరిచయమయ్యారు. ఒకరోజు ఉన్నట్లుండి తనను ఈశ్వరుడు ఆవహించాడనీ, రోగులకు వ్యాధులను నయం చేయమని చెప్పాడని ప్రకటించాడు.
అంతే అప్పటి నుంచి అతని వద్దకు రోగం నయం చేయమని జనాలు రావడం మొదలుపెట్టారు. దీంతో అతను గోపాల్పేట్ మండలంలో తిష్ట వేశాడు. తొలుత ఉచిత చికిత్స చేస్తానన్న ఈ బాబా ఆ తర్వాత క్రమంగా డబ్బులు వసూలు చేయడం మొదలుపెట్టాడు.
చెంబులోని నీళ్లను రోగి నోట్లో పోయడం, తల మీద గట్టిగా కొట్టడం, కాలు తొక్కడంతో అతను చేసే వైద్యం పూర్తవుతుంది. దీంతో ప్రజలు నిమ్మకాయలు, నీళ్ల బాటిళ్లతో బాబా చికిత్సకోసం బారులుతీరి ఉంటున్నారు. చివరికి 108 వాహనంలోని రోగులు కూడా బాబా వద్దకు వస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ప్రజలు చైతన్యవంతులు కానంతవరకూ ఖాసింలాంటి బాబాలు పుట్టుకొస్తునే వుంటారు.