వాట్సాప్‌ను ఉపయోగిస్తున్నారా? అయితే ఇలాంటి మెసేజ్‌లతో జాగ్రత్త (Video)

మంగళవారం, 2 జూన్ 2020 (17:30 IST)
ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది. భారత్‌లో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. లాక్‌డౌన్ సమయంలో ఎలాంటి ప్రయాణాలు లేని తరుణంలో వాట్సాప్‌ను వినియోగించే వారు దాదాపు 40 శాతం అదనంగా వాట్సాప్‌తో సమయం గడుపుతున్నారని నివేదికలు చెబుతున్నాయి. ఇదే అదునుగా చేసుకుని యూజర్‌ల డేటాను చోరీ చేసేందుకు సైబర్ నేరగాళ్లు వివిధ మార్గాలను అన్వేషిస్తున్నారు. సైబర్ నేరగాళ్లు డేటాను చోరీ చేసే అవకాశం ఉందని వాట్సాప్ టెక్నికల్ టీమ్ తమ యూజర్‌లను హెచ్చరించింది.
 
వాట్సాప్ వెరిఫికేషన్ అంటూ హ్యాకర్లు ఒక మెసెజ్ పంపుతారు. వారు పంపిన ఆరు అంకెల పిన్‌ను ఎంటర్ చేయమని కోరుతారు. వారు చెప్పినట్లు చేసారో, ఇక అంతే సంగతులు. మీరు ఇతరులతో షేర్ చేసే మెసేజ్‌లు, ఫోటోలు, వీడియోలను వారు కూడా చూడగలరు. అంతేకాకుండా వీటిని మీ స్నేహితులు, బంధువులు మరియు వేరే గ్రూప్‌లకు షేర్ చేయమని కోరతారు.
 
అయితే వాట్సాప్ సంస్థ ఇటువంటి వెరిఫికేషన్ మెసేజ్‌లను విశ్వసించవద్దని తమ యూజర్‌లను కోరింది. వెరిఫికేషన్ గురించి తాము ఎప్పుడూ కోరబోమని ఆ సంస్థ ప్రకటించింది. ఒకవేళ యూజర్‌లకు ఏమైనా తెలియజేయాలనుకుంటే, నీలిరంగులో టిక్ ఉన్న ఖాతా నుండి మాత్రమే మెసేజ్ వస్తుందని వాట్సాప్ టీమ్ తెలిపింది. మీరు ఇలాంటి మెసేజ్‌లకు ప్రతిస్పందించినట్లయితే, వెంటనే మీ డివైజ్‌లోని వాట్సాప్ ఖాతా నుండి లాగ్ అవుట్ చేసి, మళ్లీ రీ వెరిఫికేషన్ చేసుకోవాల్సిందిగా వాట్సాప్ టెక్నికల్ టీమ్ తమ యూజర్‌లకు సూచిస్తోంది.

 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు