విదేశీ ల్యాప్‌టాప్ దిగుమతులపై ఆంక్షలు.. ఎందుకంటే...

ఠాగూర్

సోమవారం, 21 అక్టోబరు 2024 (10:18 IST)
మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా దేశీయంగా తయారు చేసే గాడ్జెట్స్‌ను ప్రోత్సహించే చర్యలను కేంద్ర ప్రభుత్వం ముమ్మరం చేసింది. ఇందులోభాగంగా, విదేశాల నుంచి దిగుమతి చేసుకునే అనేక రకాలైన గాడ్జెట్స్‌పై కేంద్రం అంచలంచలుగా ఆంక్షలు విధిస్తుంది. ఈ క్రమంలోనే విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు, పర్సనల్ కంప్యూటర్లపై ఆంక్షలు విధించేందుకు సన్నాహాలు చేస్తుంది. 
 
ముఖ్యంగా ల్యాప్‌టాప్‌ల దిగుమతులపై 2025 జనవరి తర్వాత పరిమితి పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ అంశంతో నేరుగా సంబంధమున్న ఇద్దరు వ్యక్తులను ఉటంకిస్తూ ఒక ఇంగ్లీష్ న్యూస్ ఏజెన్సీ ఈ విషయాన్ని పేర్కొంది. వీటి దిగుమతులపై ఆంక్షలు విధిస్తే, యాపిల్‌ వంటి దిగ్గజ సంస్థలు భారత్‌లో సత్వరం తయారీ పెంచుతాయని ప్రభుత్వం భావిస్తోంది.
 
ఒకవేళ కంప్యూటర్ల దిగుమతులపై ప్రభుత్వం ఆంక్షలు విధిస్తే ఇప్పటివరకు వీటి దిగుమతులపై భారీగా ఆధారపడిన ఐటీ హార్డ్‌వేర్‌ మార్కెట్‌ ధోరణి మారిపోవచ్చు. ఈ నిర్ణయంతో 10 బిలియన్‌ డాలర్ల (సుమారు 84,000 కోట్ల) మేరకు ఈ పరిశ్రమపై ప్రభావం పడుతుందని అంచనా. వీటి దిగుమతులపై ఆంక్షలు విధించాలన్న ప్రతిపాదన ఇంతకుముందే వచ్చింది. అయితే అమెరికా కంపెనీల నుంచి బలమైన ఒత్తిడి రావడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. దేశీయంగా తయారీ ప్రారంభించేందుకు కంపెనీలకు తగిన సమయం ఇచ్చినట్లు ప్రభుత్వం భావిస్తోందని సంబంధిత వ్యక్తులు తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు