టెక్ దిగ్గజ కంపెనీ గూగుల్ కంపెనీలో ఉద్యోగాల్లో కోత విధించనున్నారు. ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్, పిక్సెల్ ఫోన్స్, క్రోమ్ బ్రౌజర్ విభాగాల్లో పని చేస్తున్న ఉద్యోగులపై వేటువేయనున్నట్టు సమాచారం. ఈ సంస్థకు చెందిన విశ్వసనీయ వర్గాల ద్వారా లేఆఫ్స్ సమాచారం బయటకు వచ్చింది. ఈ మేరకు ది ఇన్ఫర్మేషన్ అనే మీడియా సంస్థ ఓ కథనాన్ని ప్రచురించింది. అయితే, ఎంతమంది ఉద్యోగులను తొలగించనుందన్న వార్త మాత్రం వెలుగులోకి రాలేదు.
కాగా, గూగుల్ గత యేడాది డిసెంబరు నెలలో పది శాతం మంది ఉద్యోగులకు లేఆఫ్లు ప్రకటించిన విషయం తెల్సిందే. లేఆఫ్స్ పొందిన వారిలో డైరెక్టర్లు, మేనేజర్లు, వైస్ ప్రెసిడెంట్ల హోదాలో పనిచేస్తున్న వారు ఉండం గమనార్హం. అంతకుముందు 2023 జనవరి నెలలో 12 వేల మంది ఉద్యోగులను ఆ సంస్థ తొలగించింది. ఇక ఈ యేడాది ఫిబ్రవరిలో కూడా క్లౌడ్ ఆర్గనైజేషన్, హెచ్.ఆర్ విభాల్లో కొంతమందిని తొలగించింది.
వ్యయం తగ్గింపులో భాగంగా, టెక్ దిగ్గజం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, ఆర్థిక అస్థిరత గ్లోబల్ మార్కెట్లలో ఒత్తిడి, అమెరికాలో మాంద్య భయాలు, టారిఫ్ల వార్, ఏఐ వినియోగం పెరగడం, లాభాల క్షీణత వెరసి కంపెనీల ఖర్చులు తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇందులోభాగంగా, పెద్ద ఎత్తున ఉద్యోగులకు లేఆఫ్లు ఇస్తున్నాయి.