భారత్‌లో 12 ఐఫోన్ల తయారీ- యాపిల్ ప్రకటనతో పెరగనున్న ఉద్యోగవకాశాలు

శుక్రవారం, 12 మార్చి 2021 (20:26 IST)
యాపిల్ కంపెనీ ఇక భారత్‌లో తమ ఉత్పత్తులను తయారు చేయాలని నిర్ణయించింది. తమ పార్టనర్ కంపెనీ ఫాక్స్‌కాన్ సాయంతో తమిళనాడులో ఉన్న ప్లాంటులో ఐఫోన్ 12 ఫోన్లను అసెంబుల్ చేస్తామని యాపిల్ ప్రకటించింది. ఈ విషయాన్నికేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కూడా ధ్రువీకరించారు. 
 
తమిళనాడులో యాపిల్ నిర్ణయం వల్ల మన దేశంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయని ట్వీట్ చేశారు. యాపిల్ 2017లో భారత్‌లో ఐఫోన్ల తయారీని ప్రారంభించింది. ఈ సంస్థకు ఫాక్స్ కాన్, విస్రాన్ వంటి థర్డ్ పార్టీ మ్యాన్యూఫాక్చరింగ్ కంపెనీలతో పార్ట్ నర్‌షిప్ ఉంది. వీటి సాయంతో యాపిల్ మన దేశంలో ఉత్పత్తులను తయారుచేస్తోంది.
 
భారత్‌లో ఐఫోన్ 12 మోడళ్ల తయారీపై యాపిల్ నిర్ణయం తీసుకోనుందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సంస్థ అధికారికంగా స్పందించింది. ప్రస్తుతం ఐఫోన్ 12 బేస్ మోడళ్లను మాత్రమే భారత్‌లో తయారు చేస్తామని యాపిల్ ప్రకటించింది. ఎప్పటిలాగానే చైనా నుంచి ఐఫోన్ 12 ప్రో, ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్ మోడళ్ల దిగుమతులు కొనసాగుతాయని సంస్థ వెల్లడించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు