శ్రేయా ఘోషల్ పుట్టిన రోజు.. ఒక్కడు చిత్రంతో జర్నీ మొదలు.. లవ్యూ సో మచ్ అంటూ..?

శుక్రవారం, 12 మార్చి 2021 (12:36 IST)
ప్రముఖ గాయని శ్రేయో ఘోషల్ పుట్టినరోజు నేడు. హిందీలోనే కాకుండా దక్షిణాది భాషలలో ఎన్నో పాటలు ఆలపించారు. ఆమె, తమిళ చిత్రం ఆల్బంలోని "చెల్లమే చెల్లమ్" అనే పాటతో దక్షిణ భారత చలన చిత్ర సీమలోకి రంగప్రవేశం చేశారు. 
 
'ఒక్కడు' చిత్రంలో "నువ్వేం మాయ చేసావో గాని "ఆమె మొదటి తెలుగు పాట. 'బిగ్ బి' చిత్రంలో "విదా పరయుకాయనో " శ్రేయ పాడిన మొట్ట మొదటి మలయాళ పాట. ఆమెకు ఇప్పటిదాకా ఆమె పాడిన హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ పాటలకు ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు, మలయాళం, తమిళ్ రాష్ట్ర పురస్కారాలు లభించాయి. 
 
2010 సంవత్సరంలో ఆంగ్ల చిత్రమైన వెన్ హేరీ ట్రైస్ టు మేరీలో ఆమె పాడారు. ఆమె ఈ మధ్య తెలుగులో 'శ్రీరామరాజ్యం' చిత్రంలో పాడిన పాటలు చాలా ప్రఖ్యాతి పొంది వివిధ రకాల శ్రోతల మన్ననలను అందుకున్నాయి.
 
సోనీ టీవీలో ప్రసారమయ్యే "ఎక్స్ ఫ్యాక్టర్" అనే ఒక స్వర సంగ్రామానికి ప్రఖ్యాత నేపథ్య గాయకుడు సోనూ నిగమ్, సంజయ్ లీలా భంసాలీ లతో కలిసి న్యాయ నిర్ణేతగా శ్రేయ వ్యవహరించారు. అలాగే మ్యూజిక్ కా మహా మూకాబలా అనే పోటీలో ఆమె తన బృందానికి నాయకురాలిగా చాలా చక్కని పాత్ర పోషించారు. సంజయ్ లీలా భంసాలీ (న్యాయనిర్ణేత, ప్రఖ్యాత దర్శకుడు) ని తన గాత్రంతో ఆకట్టుకున్నారు. 
 
2000లో సంజయ్ లీలా భన్సాలీ శ్రేయకు "దేవదాసు" చిత్రంలో కథానాయిక పాత్ర పారోకు గాత్ర దానం చేసే అవకాశం ఇచ్చారు. ఆమె ఆ చలన చిత్రంలో 5 పాటలను ఆలపించారు. ఆ చిత్రంలో "బైరీ పియా " పాటకు గాను ఆమెకు భారత జాతీయ చలనచిత్ర పురస్కారం లభించింది. 
Shreya Ghoshal
 
అదే చిత్రానికి ఆమెకు ఉత్తమ నేపథ్య గాయనిగా ఉత్తరాది ఫిల్మ్ ఫేర్ పురస్కారం లభించింది. శ్రేయ ఘోషల్ నాలుగు నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్, ఆరు ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్, తొమ్మిది ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ (సౌత్)లను సొంతం చేసుకున్నారు. మార్చి 12, 1984, రాజస్థాన్‌లో జన్మించింది. తెలుగులో ఒక్కడు చిత్రంతో మొదలైన ఆమె ప్రయాణం నేటికి దిగ్విజయంగా సాగుతోంది. మణిశర్మ దగ్గరి నుంచి నేటి యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ల వరకు అందరితో కలిసి పనిచేసింది. ఆమె పాట పాడుతుందంటే.. దానికంటూ ఓ ప్రత్యేకత ఉంటుందని ఆమె అభిమానులు భావిస్తుంటారు.
 
శ్రేయా ఘోషాల్ తన చిన్ననాటి స్నేహితుడు.. శైలాదిత్యను వివాహం చేసుకున్నారు. అయితే ఆమెకు తన భర్త అంటే ఎంత ఇష్టమో ఈ పోస్ట్ చూస్తేనే తెలుస్తోంది. ‘హ్యాపీ బర్త్ డే మై లవ్.. ఆరోగ్యంగా సంతోషంగా, ప్రతీ క్షణం నవ్వుతూ ఉండాలి. మనకు వయసు పెరుగుతోంది.. కానీ, నీతో ఉంటే నేను పదహారేళ్ల అమ్మాయిలానే ఫీలవుతా.. ఈ ప్రపంచంలో నువ్వే గొప్ప భర్తవి, కొడుకువి, తమ్ముడివి, అన్నవి, స్నేహితుడివి.. లవ్యూ సో మచ్' అంటూ సోషల్ మీడియాలో వేదికగా తన భర్తపై ఉన్న అమితమైన ప్రేమను వ్యక్త పరిచింది. కాగా కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉండే శ్రేయా.. ఇటీవల ఓ వ్యక్తిగత శుభవార్తను ఫ్యాన్స్‌తో పంచుకుంది. తాను గర్భవతిగా ఉన్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. 
 
తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ మేరకు కడుపుతో ఉన్న ఓ ఫొటోను షేర్ చేసిన ఈ టాప్ సింగర్.. 'బేబీ శ్రేయాదిత్య కమింగ్‌. మా జీవితంలో ఈ సరికొత్త అధ్యాయాన్ని పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ శుభ సమయంలో అందరి ప్రేమ, ఆశీస్సులు కావాలి' అంటూ కోరింది. దీంతో ఆమెకు సినీ ప్రముఖులతో పాటు సామాన్య నెటిజన్ల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు