మూడు రోజుల్లో ఆఫీసుకు రావాలి.. లేదంటే ఇంటికే : మెటా హెచ్చరిక

ఆదివారం, 20 ఆగస్టు 2023 (11:00 IST)
ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా తమ ఉద్యోగులకు గట్టి హెచ్చరిక చేసింది. కరోనా మహమ్మారి తర్వాత ఇంటి నుంచే పని చేస్తున్న ఉద్యోగులకు ఈ హెచ్చరిక వర్తించనుంది. మరో మూడు రోజుల్లో ఆఫీసుకు వచ్చి విధులు నిర్వహించాలని లేనిపక్షంలో ఇంటికి వెళ్ళక తప్పదని హెచ్చరించింది. 
 
నిజానికి చాలా మంది ఉద్యోగులు ఇప్పటికీ ఇంటి నుంచే పని చేస్తున్నారు. ఈ వాతావరణం నుంచి ఇంకా బయటకు రాలేకపోతున్నారు. వారానికి మూడు రోజులు ఆఫీసులకు వచ్చి పనిచేయాలని ఇప్పటికే పలు కంపెనీలు సూచిస్తున్నా పట్టించుకోవడం లేదు. దాదాపు అన్ని కంపెనీల్లో ఇలాంటి పరిస్థితే నెలకొంది. 
 
ఈ నేపథ్యంలో మార్క్ జుకర్ బర్క్‌కు చెందిన మెటా సంస్థ ఉద్యోగులకు వార్నింగ్ ఇచ్చింది. వారంలో మూడు రోజులు ఆఫీసుకు రావాలని సూచించింది. ఒకవేళ నియామవళిని ఉల్లంఘిస్తే ఇంటికెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించింది. సెప్టెంబరు 5 నుంచి వారానికి మూడు రోజుల పాటు ఆఫీసులకు వచ్చి పనిచేయాల్సిందేనని ఉద్యోగులకు జారీ చేసిన నోటీసులో మెటా పేర్కొంది.
 
ఒకవేళ పదేపదే నియమాలను ఉల్లంఘిస్తే ఉద్యోగాలు తొలగిపోయే ప్రమాదమూ ఉంటుందని హెచ్చరించింది. కార్యాలయాలకు వస్తున్నదీ లేనిదీ తనిఖీ చేయాలని మేనేజర్లకు సూచించింది. ఉద్యోగుల మధ్య బంధాలు బలోపేతం చేయడానికి, టీమ్ వర్క్ ఈ నిర్ణయం దోహదపడుతుందని నోటీసులో పేర్కొంది. అయితే, ఈ నిర్ణయం నుంచి రిమోట్ ఉద్యోగులను మెటా మినహాయించింది. 
 
'ఆఫీసులో ఉంటూ పనిచేస్తేనే మంచి పురోగతి సాధించగలుగుతాం. ఇంట్లో ఉంటూ వర్క్ చేసే వారి కంటే ఆఫీసుకు వచ్చి పనిచేసే వారే మంచి ఫలితాలను పొందుతున్నారు' అని జుకర్ బర్గ్ ‌గతంలోనే ఓ సందర్భంలో ఉద్యోగులతో అన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు