చైనా ఫోన్లపై నిషేధం లేదు : కేంద్ర టెలికాం శాఖ

మంగళవారం, 30 ఆగస్టు 2022 (08:56 IST)
దేశ భద్రతకు ముప్పుగా పరిణమించి చైనా ఫోన్లపై కేంద్రం నిషేధం విధించబోతుందంటూ సాగుతున్న ప్రచారాన్ని కేంద్ర టెలికాం మంత్రిత్వ శాఖ కొట్టివేసింది. అలాంటి ప్రతిపాదన ఏదీ లేదని స్పష్టం చేసింది. పైగా, ఇలాంటి వార్తలు ఎక్కడ నుంచి పుట్టుకొస్తాయో కూడా తెలియదని వ్యాఖ్యానించింది. అదేసమయంలో చైనా మొబైల్ కంపెనీలు మరింత పారదర్శకంగా కార్యకలాపాలు నిర్వహించేలా చేయడమే తమ లక్ష్యమని పేర్కొంది. 
 
భారతీ స్మార్ట్ ఫోన్ మొబైల్ మార్కెట్‌లో చైనా మొబైల్స్ కంపెనీలు తమ ఆధిపత్యాన్ని చాటుతున్నాయి. ఈ ఫోన్ల ద్వారా దేశ భద్రతతో పాటు వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లుతుందని, సమాచారం తస్కరణకు గురువుతుందంటూ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో 12 వేల రూపాయల లోపు ఫోన్లపై కేంద్రం నిషేధం విధించనుందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలపై కేంద్ర టెలికాం శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పందించారు. 
 
చైనా మొబైళ్లపై నిషేధం విధించే యోచనేదీ లేదని స్పష్టం చేశారు. అదేసమయంలో ఎలక్ట్రానిక్స్ వస్తు ఉత్పత్తిలో దేశీయ కంపెనీలు మరింతగా ముఖ్య పాత్రను పోషించాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. అంతమాత్రాన విదేశీ బ్రాండ్లను పూర్తిగా లేకుండా చేయాలన్న ఉద్దేశ్యం తమకు లేదన్నారు. రూ.12 వేల లోపు చైనా మొబైల్ ఫోన్లపై నిషేధం వార్తలు ఎక్కడ నుంచి పుట్టుకొచ్చాయో తనకు తెలియదంటూ ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు