వర్క్ ఫ్రమ్ హోమ్‌పై గూగుల్ నిర్ణయం.. 2022 వరకు..?

బుధవారం, 1 సెప్టెంబరు 2021 (14:26 IST)
వర్క్ ఫ్రమ్ హోమ్‌పై నంబర్‌ వన్‌ సెర్చ్‌ ఇంజన్‌ గూగుల్‌ సైతం స్పందించింది. కరోనా విజృంభనతో కార్పోరేట్‌ కంపెనీలు, ముఖ్యంగా ఐటీ కంపెనీలు తమ ఆఫీసులకు తాళాలు వేశాయి. ఉద్యోగులను ఇంటి నుంచే పని చేయాలంటూ చెప్పాయి. 
 
అయితే వర్క్‌ఫ్రం హోం మొదలై ఏడాది గడిచిపోవడంతో క్రమంగా అన్ని ఆఫీసులు ఉద్యోగులను ఆఫీసుకు వచ్చి పని చేయాలని కోరుతున్నాయి. గూగుల్‌ సైతం సెప్టెంబరు మొదటి వారం నుంచి ఉద్యోగులను ఆఫీసులకు వచ్చి పని చేయాలని కోరింది. ఆ తర్వాత ఈ గడువును అక్టోబరుకు పొడిగించింది. తాజాగా వర్క్‌ఫ్రం హోంపై ఆ కంపెనీ కీలక ప్రకటన చేసింది.
 
కరోనా తగ్గుముఖం పట్టినట్టే కనిపిస్తోన్నా కొత్త రకం మ్యూటెంట్లతో ఎప్పటికప్పుడు ప్రమాదం ముంచుకొస్తూనే ఉంది. ఇప్పుడు అమెరికాతో పాటు అనేక దేశాల్లో డెల్టా వేరియంట్‌తో వేల సంఖ్యలో కేసులు వస్తున్నాయి. దీంతో ఉద్యోగులను ఆఫీసులకు రమ్మనే విషయంలో గూగుల్‌ వెనక్కి తగ్గింది. 2022 జనవరి తర్వాత వరకు వర్క్‌ఫ్రం కొనసాగించాలని నిర్ణయించింది. ఆఫీసులకు వచ్చి పని చేయాలనే నిబంధను ఐచ్ఛికంగా మార్చింది. ఈ మేరకు గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచయ్‌ కంపెనీ ఉద్యోగులకు ఈ మెయిల్‌ పంపారు.
 
'2022 జనవరి 10 తర్వాత వివిధ దేశాల్లో ఉన్న పరిస్థితులను బట్టి అక్కడ వర్క్‌ఫ్రం హోం కొనసాగించాలా ?, ఆఫీసులకు వచ్చి పని చేయాలా ? అనే అంశాలపై నిర్ణయం తీసుకుంటాం' అని మెయిల్‌లో ఆయన పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు