వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగులకు ఆఫీసు సౌకర్యాలు : సుందర్ పిచాయ్

సోమవారం, 28 సెప్టెంబరు 2020 (14:55 IST)
వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్న ఉద్యోగులకు ఆఫీసు సౌకర్యాలు కల్పించే విషయాన్ని ఆలోచన చేస్తున్నట్టు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తెలిపారు. అంతేకాకుండా, భవిష్యత్తులో గూగుల్ ఉద్యోగులు హైబ్రిడ్ వర్క్ ఫ్రమ్ హోమ్ తరహాలో పనిచేస్తారని ఆయన వెల్లడించారు. 
 
తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, మున్ముందు మరింత సులభతరమైన పని విధానాలు అందుబాటులో వస్తాయని భావిస్తున్నాను. వ్యక్తిగతంగా, లేదా సమూహంగా కఠినమైన సమస్యలను పరిష్కరించేటప్పుడు అందరి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కొత్త అవకాశాలను సృష్టించాలి. కాబట్టి ముందు ముందు పరిస్థితులు మారవనిగానీ, 100 శాతం రిమోట్ తరహాలోనో, లేక మరో విధానంలోనో ఉంటుందని గానీ అనుకోలేం. కానీ మరిన్ని సులభతరమైన విధానాలు, మరిన్ని హైబ్రిడ్ మోడల్స్‌పై మాత్రం మనం దృష్టిపెట్టాల్సి ఉంటుంది అని వ్యాఖ్యానించారు. 
 
నిజానికి తమ సంస్థ అంతర్గతంగా నిర్వహించిన ఓ సర్వేలో 62 శాతం ఉద్యోగులు ఆఫీసులకు తిరిగి రావాలని భావిస్తున్నప్పటికీ.. ప్రతి రోజూ వచ్చేదుకు మాత్రం ఇష్టపడటం లేదనే విషయం తేలిందని చెప్పుకొచ్చారు. అందుకే ఉద్యోగులకు ఆఫీసు సదుపాయాలు ఏర్పాటు చేయడం సహా దీర్ఘకాలిక ప్రయోజనం చేకూర్చే పలు అవకాశాలపై కసరత్తు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. కాగా, కరోనా మహమ్మారి ప్రారంభమైన తర్వాత వచ్చే యేడాది జూలై వరకు జూలై వరకు వర్క్ ఫ్రమ్ హోం సదుపాయాన్ని కల్పించిన సంస్థగా గూగుల్ రికార్డుకెక్కింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు