జగన్ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్‌కు కోవర్టుల బెడదట

శనివారం, 29 అక్టోబరు 2011 (12:08 IST)
కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలను ఒకప్పుడు వేధించిన కోవర్టుల బెడద ఇపుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పట్టుకున్నదట. ఆ పార్టీకి జనాదరణ బాగానే ఉన్నా పార్టీ జిల్లాస్థాయిలో ఉన్న నేతలు కొందరు అధికార పార్టీతో లాలూచిపడి కోవర్టుల్లా వ్యవహరిస్తున్నారన్న అనుమానాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోని కీలక నేతలు వ్యక్తం చేస్తున్నారట.

ఇదే విషయాన్ని జగన్ మోహన్ రెడ్డికి దృష్టికి తీసుక వెళ్లినట్లు సమాచారం. అన్నీ తానై పార్టీని నడుపుతున్న జగన్ దీనిపై లోతుగా పరిశీలిస్తున్నట్లు తెలిసింది. పైగా పార్టీకి జనంలో ఆదరణ బాగానే ఉన్నా పార్టీ పనితీరు మాత్రం ఆశించినంత స్థాయిలో లేదని జగన్ భావిస్తున్నట్లు సమాచారం.

కొంతమంది పార్టీ అధ్యక్షులు ఇతర పార్టీలకు చెందిన ప్రముఖులతో సంబంధాలు పెట్టుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని పట్టించుకోవడం లేదన్న అనుమానాలు సైతం ఉన్నాయి. మరోవైపు పార్టీకోసం కృషి చేసినా తమకు వచ్చే ఎన్నికల్లో సీటు దక్కుతుందో లేదోనన్న అనుమానం ఉండటంతో రెండు పడవలపై ప్రయాణం సాగిస్తున్నారన్న వాదన బలంగా వినబడుతోంది.

దీంతో అప్రమత్తమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు క్షేత్రస్థాయి వరకూ పార్టీని విస్తరింపజేసేందుకు కసరత్తు ప్రారంభించారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాలను ముమ్మరం చేయడం ద్వారా మరింతమందిని పార్టీలోకి ఆకర్షించాలని చూస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి