కృష్ణా పుష్క‌ర యాత్రికుల‌తో ఏర్పాట్ల‌పై సీఎం చంద్ర‌బాబు స‌ర్వే!

శనివారం, 13 ఆగస్టు 2016 (18:57 IST)
విజ‌య‌వాడ‌: ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఏది చేసినా... చాలా టెక్నిక‌ల్‌గా చేస్తారు. ఇపుడు కృష్ణా పుష్కరాల్లోనూ అదే చేస్తున్నారు. పుష్క‌ర ఏర్పాట్లు ఎలా జ‌రుగుతున్నాయ‌నే విష‌యాన్ని ఆయ‌న ఒక స‌ర్వే ద్వారా తెలుసుకుంటున్నారు. పుష్క‌ర యాత్రికుల‌కు 26 ప్ర‌శ్న‌ల‌తో కూడిన స్లిప్ ఇచ్చి... అక్క‌డిక‌క్క‌డ పూర్తి చేయిస్తున్నారు. ఈ స‌ర్వేపై, తొలి రోజు పుష్క‌రాల తీరు తెన్నుల‌పై సీఎం శ‌నివారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. 
 
మొదటి రోజు ఏర్పాట్లలో అధికార యంత్రాంగం పనితీరుపై చంద్ర‌బాబు సంతృప్తి ప్రకటించారు. పుష్కరాలపై ప్రజల్లో ఉత్సాహం చాలా బాగుంద‌ని, అక్కడక్కడ చిన్నచిన్న సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాల‌ని టెలీకాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు అధికారుల‌ను ఆదేశించారు. అభిప్రాయ సేకరణలో భాగంగా 26 ప్రశ్నలకు యాత్రికులు ఇచ్చి, వారి స్పంద‌న‌ను సీఎం వివ‌రించారు.
 
పుష్క‌ర స‌ర్వే రిపోర్ట్....
- పుష్కర సమాచార కేంద్రాలు ఉన్నాయని 96 శాతం మంది పేర్కొనగా, లేవని 3.47 % పేర్కొన్నారు.
- విద్యుత్ సౌకర్యంపై 70  శాతం మంది బాగుంది అనగా, 15 శాతం ఫర్వాలేదని, 8 శాతం బాగా లేదని, 7 శాతం తెలియదని చెప్పారు.
-  ట్రాఫిక్ నియంత్రణ ఏర్పాట్లపై బాగుందని 81 % పేర్కొనగా , ఫర్వాలేదని 12 శాతం మంది, బాగాలేదని 7 శాతం మంది అన్నారు. 
- తాగునీటి సదుపాయం బాగుందని 83 శాతం పేర్కొనగా, బాగాలేదని 14.68 శాతం తెలిపారు. 
- ఆహార సదుపాయం బాగుందని 72 శాతం పేర్కొనగా, 18 శాతం ఫర్వాలేదని, 8 శాతం బాగాలేదని అన్నారు. 
- పారిశుద్ధ్యం బాగుందని  83 శాతం అనగా, ఫర్వాలేదని 16 శాతం , బాగాలేదని 1 శాతం అన్నారు. 
- పోలీసుల పనితీరు పట్ల 83.18 % బాగుంది అనగా, 15 శాతం బాగాలేదని అన్నారు. 
-  ఘాట్లలో నీటి పరిశుభ్రత, పుష్కర నగర్‌లలో పారిశుద్ధ్యం, ఇతర సదుపాయాలపై వేసిన ప్రశ్నలకు ప్రజల నుంచి 60 శాతం పాజిటివ్ రెస్పాన్స్ వ‌చ్చింది. 
-  అన్ని శాఖల పనితీరుపై  ప్రజల్లో 95 శాతం సంతృప్తి రావాల‌ని టెలీకాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు ఆదేశించారు.

వెబ్దునియా పై చదవండి