గుజరాత్ రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ స్టార్ ప్రచారకర్తలు వీరే!!

వరుణ్

బుధవారం, 17 ఏప్రియల్ 2024 (11:19 IST)
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్ రాష్ట్రంలో తమ పార్టీ తరపున ప్రచారం చేసే స్టార్ ప్రచార కార్యకర్తల వివరాలను బహిర్గతం చేసింది. ఇందులో ఢిల్లీ ముఖ్యమంత్రి, అరవింద్ కేజ్రీవాల్, పార్టీ నేతలు మనీస్ సిసోడియా, సత్యేంద్ర జైన్ పేర్లతో పాటు కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సింగ్ పేర్లు కూడా ఉన్నాయి. ఈ జాబితాలో మొత్తం 40 మంది పేర్లు ఉన్న జాబితాను ఎన్నికల సంఘానికి సమర్పించింది. వీరిలో కేజ్రీవాల్, మనీస్ సిసోడియాలు ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టు అయి తీహార్ జైలులో ఉన్న విషయం తెల్సిందే. 
 
కాగా, ఈ జాబితాలో ఉన్న మిగతా ప్రముఖుల విషయానికి వస్తే రాజ్యసభ ఎంపీలు సంజయ్ సింగ్, రాఘవ్ చద్దా, సందీప్ పాఠక్ ఉన్నారు. మరో ఇద్దరు ఎంపీలు హర్భజన్ సింగ్, స్వాతి మలివాల్ పేర్లు ఈ జాబితాలో లేవు. ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కేజ్రివాల్‌ను ఈడీ గత నెల 21వ తేదీ అరెస్టు చేసింది. ఆయన ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైల్లో ఉన్నారు. 
 
గుజరాత్ రాష్ట్రంలోని 26 లోక్ సభ స్థానాలు ఉండగా మిత్రపక్షం కాంగ్రెస్ 24 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ భరూచ్, భావ్నగర్ నియోజకవర్గాల్లో బరిలో నిలిచింది. బరూచ్ నుంచి చైతర్ వాసవ, భావ్నగర్ నుంచి ఉమేష్ మక్వానాను ఆమ్ ఆద్మీ పార్టీ బరిలోకి దింపింది. గుజరాత్ లోక్‌సభ ఎన్నికలు మే 7న ఒకే దశలో జరగనున్నాయి. నామినేషన్ పత్రాల స్వీకరణకు చివరి తేదీ ఏప్రిల్ 19తో ముగియనుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు