సౌత్ చెన్నై నుంచి బరిలోకి దిగుతున్న తెలంగాణ మాజీ గవర్నర్!

ఠాగూర్

గురువారం, 21 మార్చి 2024 (22:54 IST)
రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర మాజీ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర్ రాజన్ చెన్నై సౌత్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. అలాగే, తమిళనాడు రాష్ట్ర శాఖ బీజేపీ అధ్యక్షుడు కె.అన్నామలై కోయంబత్తూరు స్థానం నుంచి పోటీ చేయనుండగా, కేంద్ర సహాయ మంత్రి ఎల్. మురుగన్ మాత్రం రిజర్వు స్థానమైన నీలగిరి నుంచి బరిలోకి దిగుతున్నారు. అలాగే, కన్యాకుమారి స్థానం నుంచి సీనియర్ నేత, మాజీ మంత్రి పొన్ రాధాకృష్ణన్ పోటీ చేస్తున్నారు. ఈ మేరకు బీజేపీ విడుదల చేసిన మూడో జాబితాలో తమిళనాడు రాష్ట్రం నుంచి పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ప్రధానంగా పేర్కొంది. 
 
ఈ జాబితా ప్రకారం కోయంబత్తూరు నుంచి కె.అన్నామలై, చెన్నై సౌత్ నుంచి తమిళిసై సౌందర్ రాజన్, నీలగిరి నుంచి ఎల్.మురుగన్, చెన్నై సెంట్రల్ నుంచి వినోజ్ సెల్వం, వేలూరు నుంచి సీవీ షణ్ముగం, కృష్ణగిరి నుంచి సి.నరసింహన్, పెరంబలూరు నుంచి టీఆర్ పారివేందర్, తూత్తుక్కుడి నుంచి నైనారా నాగేంద్రన్, కన్యాకుమారి నుంచి పొన్న రాధాకృష్ణన్‌లు పోటీ చేస్తారని ప్రకటించారు. కాగా, తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గాను, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా విధులు నిర్వహిస్తూ వచ్చిన తమిళిసై సౌందర్ రాజన్ ఇటీవల తన గవర్నర్ పదవులకు రాజీనామా చేసి... బీజేపీ ప్రాథమి సభ్యుత్వం స్వీకరించిన విషయం తెల్సిందే. 
 
సికింద్రాబాద్ కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థిగా దానం నాగేందర్! 
 
ఇటీవల భారత రాష్ట్ర సమితి పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ మంత్రి దానం నాగేందర్‌కు జాక్‌పాట్ తగిలింది. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఆయన సికింద్రాబాద్ ఎంపీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు. ఈ  మేరకు కాంగ్రెస్ పార్టీ గురువారం ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో ఆయనకు సీటు కేటాయించింది. అలాగే, పెద్ద పల్లి నుంచి వంశీకృష్ణ, చేవెళ్ల నుంచి రంజిత్ రెడ్డి, నాగర్ కర్నూల్ నుంచి మల్లు రవిలు పోటీ చేస్తున్నారు. దేశంలోనే అతిపెద్ద లోక్‌సభ స్థానంగా గుర్తింపు పొందిన మల్కాజ్‌గిరి నుంచి సునీత మహేందర్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించారు. 
 
తాజాగా ఐదుగురు అభ్యర్థుల పేర్లను మాత్రమే ప్రకటించింది. ఇంకా మరో 8 నియోజకవర్గాలకు అభ్యర్థులను పెండింగ్‌లో ఉంచింది. వీటిలో మెదక్, ఖమ్మం, భునవగిరి, ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సివుంది. దీంతో ఈ స్థానాల్లో అభ్యర్థుల ఖరారు విషయంలో సస్పెన్స్ కొనసాగుతుంది. అలాగే, లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ 57మంది అభ్యర్థులతో మూడో జాబితాను విడుదల చేసింది. కాంగ్రెస్ కీలక నేత అధిర్ రంజన్ చౌదరి వెస్ట్ బెంగాల్‌లోని బెర్హం‌పూర్ నుంచి మళ్లీ పోటీ చేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు