లోక్‌సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన పద్మశ్రీ అవార్డు గ్రహీత...

వరుణ్

శుక్రవారం, 12 ఏప్రియల్ 2024 (09:09 IST)
పద్మశ్రీ అవార్డు గ్రహీత ఒకరు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు. ఈ నెల 19వ తేదీన జరిగే తొలి దశ పోలింగ్‌లో ఆయన తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. తమిళనాడు రాష్ట్రంలోని తిరుచ్చిరాపల్లి లోక్‌సభ స్థానం నుంచి ఆయన బరిలో నిలిచారు. పేరు ఎస్.దామోదరన్. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. పారిశుద్ధ్య రంగంలో 40 యేళ్ల అనుభవం, పద్మశ్రీ అవార్డుకు ఎంపికయ్యారు. పరిశుభ్రత, పచ్చదనం, వెల్లివిరిసే నగరంగా తిరుచ్చిని తీర్చిదిద్దాలన్నదే తన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. 
 
ఒక పద్మశ్రీ అవార్డు గ్రహీత లోక్‌సభ ఎన్నికల్లో బరిలోకి దిగడం ఇపుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. అదేసమయంలో తన విజయం కోసం ఆయన వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. స్థానిక మార్కెట్ వద్ద ప్రచారం చేస్తూ కనిపించిన ఆయన.. తనకు ఓటు వేయాలంటూ అక్కడి వీధి వ్యాపారులు, సామాన్యులను అర్థించారు. వ్యాపారులతో కలిసి కూరగాయలు, పూలు అమ్ముతూ ప్రచారాన్ని హోరెత్తించారు. పారిశుద్ధ్యంపై విశేష కృషి చేసిన ఎస్.దామోదరన్ రెండేళ్ల క్రితం అప్పటి రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. 
 
ఈ ఎన్నికల్లో పోటీపై ఆయన స్పందిస్తూ, తిరుచ్చి నుంచి నేను బరిలోకి దిగాను. నేను ఇక్కడ పుట్టిన వాడిని. ఈ నగరానిక చెందిన వాడిని. గత 40 యేళ్ళుగా నేను పారిశుద్ధ్యం వలంటీరుగా పని చేస్తున్నాను. 21 యేళ్ల వయసున్నపుడు నా కెరీర్ ప్రారంభించా. ఇపుడు నాకు 62 యేళ్లు. 60 యేళ్ళ వయసులో నాకు పద్మశ్రీ అవార్డు లభించింది అని చెప్పుకొచ్చారు. 
 
తాను ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తే, పచ్చదనం వెల్లివిరిసే నగరంగా తిరుచ్చి నగరాన్ని తీర్చిదిద్దాలన్నదే తన ఆశయమన్నారు. నగరానికి ఓ రింగ్ రోడ్డు కావాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. ఫ్లైఓవర్లు కోరుతున్నారు. తనను గెలిపిస్తే ఈ ప్రాజెక్టుల సాకారం కోసం కృషి చేస్తానని తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు