లోక్‌సభ ఎన్నికలు : రోజుకు రూ.100 కోట్ల నగదు స్వాధీనం

వరుణ్

సోమవారం, 15 ఏప్రియల్ 2024 (15:39 IST)
దేశ వ్యాప్తంగా సార్వత్రిక సమరం జరుగుతుంది. ఈ ఎన్నికల్లో భాగంగా, ఈ నెల 19వ తేదీన తొలి దశ పోలింగ్ జరుగనుంది. అయితే, అన్ని దశల ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. అలాగే, ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేలా భారీ మొత్తంలో డబ్బులు, ఇతర బహుమతులను పంపిణీ చేస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ వెల్లడైన తర్వాత ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా రూ.100 కోట్ల చొప్పున నగదును స్వాధీనం చేసుకుంటున్నట్టు భారత ఎన్నికల సంఘం ప్రధానాధికారి రాజీవ్ కుమార్ తెలిపారు. 
 
మార్చి ఒకటో తేదీ నుంచి ఇప్పటివరకు రూ.4650 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్టు ఈసీ తెలిపింది. దీంతో గతంలో అన్ని ఎన్నికల రికార్డులను అధికమించినట్టు ఈసీ తెలిపింది. 75 యేళ్ల లోక్‌సభ ఎన్నికల చరిత్రలో ఇదే అత్యధికమని ఆయన తెలిపారు. గత 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల సమయంలో రూ.3475 కోట్లకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో అధికారులు, పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నార. 18వ లోక్‌సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ ఈ నెల 19వ తేదీ శుక్రవారం జరుగనుంది. 
 
రాయిదాడి కాదు.. కోడికత్తి 2.0 : 22న నామినేషన్ వేస్తున్నా : రఘురామరాజు 
 
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై గులకరాయి దాడి జరిగిందని, ఇది రాయిదాడి కాదని కోడికత్తి 2.0 డ్రామా అని ఆ పార్టీకి చెందిన రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆరోపించారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్రంలో మరో సానుభూతి నాటకానికి జగన్ తెరతీశారన్నారు. జగన్‌పై రాయి దాడి ఘటన వెనుక ఎన్నో సందేహాలున్నాయన్నారు 'యాత్ర సాఫీగా సాగుతున్న దశలో విద్యుత్తు ఎందుకు ఆగిపోయింది? ఆ క్షణంలో సాక్షి ఛానల్‌లో ప్రత్యక్ష ప్రసారం ఎందుకు నిలిచింది? భద్రతా వలయం ఏమైనట్లు? ఘటన జరిగిన వెంటనే పంగలకర్ర ఉపయోగించినట్లు ఎలా చెప్పారు' అని ప్రశ్నించారు. 
 
'సానుభూతి కోసం జరిగిన ముందస్తు నాటకంపై వారు ఏం చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. అయినా జగన్‌మోహన్‌ రెడ్డిని హత్య చేయాల్సిన అవసరం ఎవరికుంది? ఎన్నికల సర్వేలు వ్యతిరేకంగా రావడం, వైకాపా సభలు, సమావేశాలకు జనం రాకపోవడంతో సానుభూతి కోసమే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. కోడికత్తి డ్రామా కథ ఇంకా సాగుతూనే ఉంది. వివేకా హత్య వ్యవహారంలో కడపలో మొదలైన వ్యతిరేక పవనాలు రాష్ట్రమంతటా వీయడంతో స్వయంగా ఆయనే సానుభూతి కోసం ఇలాంటివి చేయించుకున్నారనే అనుమానాలున్నాయి. జడ్‌ ప్లస్‌ కేటగిరీ భద్రత ఉన్న వ్యక్తికి ఇలా జరగడం, జనాలు లేని ప్రాంతం చూసి గజమాలను ఏర్పాటు చేయడం, దానివెనుకే రాయి తగలడం అంతా సినీ ఫక్కీలో ఉంది. రాళ్లు విసిరితే కేవలం సీఎం జగన్‌కు, ఎమ్మెల్యే అభ్యర్థి వెలంపల్లికి మాత్రమే గాయాలవడం వెనుక మర్మమేంటో అర్థం కావడం లేదు' అని పేర్కొన్నారు.
 
కాగా, తాను సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని తెలిపారు. ఈ నెల 22వ తేదీన నామినేషన్‌ వేస్తున్నా. అయితే ఎంపీనా, ఎమ్మెల్యేనా అనే దానిపై ఇంకా సందిగ్ధత నెలకొనివుందని ఆయన తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు