తమ్ముళ్ళు తరపున అన్న ప్రచారం... మరో రెండురోజుల్లో మెగాస్టార్(Video)

శుక్రవారం, 22 మార్చి 2019 (22:23 IST)
తమ్ముళ్ళను రాజకీయంగా నిలబెట్టేందుకు అన్న మెగాస్టార్ చిరంజీవి ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారు. జనసేన పార్టీ తరపున చిరు ప్రచారాన్ని మరో రెండురోజుల్లో నిర్వహించేందుకు సిద్థమవుతున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్‌ విశాఖ జిల్లా గాజువాక, అలాగే భీమవరంలలో పోటీ చేయాలని నిర్ణయం తీసుకోవడంతో పాటు మరో తమ్ముడు నాగబాబు కూడా ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్థమయ్యారు. 
 
దీంతో తమ్ముళ్ళను గెలిపించి ప్రజాప్రతినిధులుగా నిలబెట్టేందుకు చిరంజీవి ప్రచారానికి సిద్థమయ్యారట. మూడురోజుల పాటు తన షూటింగ్‌ను పక్కనబెట్టి 23వ తేదీ నుంచి ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నట్లు మెగా ఫ్యామిలీలోని కుటుంబ సభ్యులే చెబుతున్నారు. చిరంజీవి రాజకీయల్లో లేకపోయినా ఆయనకు అభిమానులు ఎక్కువగానే ఉన్నారు. చిరంజీవి ప్రభావంతో పవన్ కళ్యాణ్‌, నాగబాబులకు ఓట్లు పడే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. సొంత తమ్ముళ్ళ కోసం తాను మూడు రోజులు కేటాయించడంలో తప్పేమీ లేదనుకుంటున్నారు చిరంజీవి.
 
తన కుటుంబ సభ్యులందరితో కలిసి చర్చించిన తరువాత ఈ నిర్ణయానికి తీసుకున్నారట. ఇదే విషయంపై ఇప్పటికే ఇద్దరు తమ్ముళ్ళతో చిరంజీవి మాట్లాడినట్లు తెలుస్తోంది. తన ప్రచార విషయాన్ని గోప్యంగా ఉంచి ఒకరోజు ముందుగా ప్రజలకు తెలియజేయాలని చిరంజీవి కోరారట. దీంతో ఈ విషయాన్ని బయటకు పొక్కనీయడం లేదు. 
 
రేపు జనసేన పార్టీ కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన వెలువడిన తరువాత చిరంజీవి తన ప్రచారాన్ని మూడురోజుల పాటు మూడు నియోజకవర్గాల్లో కొనసాగించబోతున్నారు. ఇప్పటికే సైరా నరసింహారెడ్డి సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న చిరంజీవి తమ్ముళ్ళ కోసం తన షూటింగ్‌ను వాయిదా వేసుకోవడం సినీవర్గాల్లోను, రాజకీయంగాను చర్చనీయాంశంగా మారుతోంది. పవన్ కల్యాణ్ నామినేషన్ వీడియో చూడండి...

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు