భారతీయ జనతా పార్టీ నేతలు మాటలు తగ్గించాలని.. నోటికి తాళం వేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హితవు పలికారు. సొంత పార్టీ నేతలు నోటికి పనిచెప్పకుండా.. కొత్తవిషయాలు ఎలా నేర్చుకోవాలన్నారు. ఇంకా ప్రజా సంక్షేమం, ప్రజా సమస్యల పరిష్కారాలపై దృష్టి పెడితే బాగుంటుందని మోడీ వార్నింగ్ ఇచ్చారు. ఒడిస్సాలో జరిగిన బీజేపీ కార్యవర్గ సమావేశాల్లో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. పార్టీ నేతలు ఎక్కడ మాట్లాడాలో అక్కడి నోరెత్తాలని.. ఎక్కడ ఎలా మాట్లాడాలో నేర్చుకోవాలని సూచించారు.
ఎప్పుడూ టీవీ చూసినా బీజేపీ నేతలు చేసే కామెంట్లు వివాదాస్పద వార్తలే కనిపిస్తున్నాయన్నారు. కాబట్టి మీడియాల్లో, సభల్లో, ఇతరత్రా కార్యక్రమాల సందర్భంగా మాట్లాడాల్సి వచ్చినప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. ఎక్కడ ఎక్కాలో ఎక్కడ తగ్గాలో బీజేపీ నేతలు పాఠాలు నేర్చుకోవాలని చెప్పారు. మైకు ముందు పెట్టేసినంత మాత్రాన మాట్లాడాల్సిన అవసరం లేదు.
చర్చలు, వివాదాలకు దారితీసే వ్యాఖ్యలను కట్టిపెట్టండని మోడీ క్లాస్ తీసుకున్నారు. కాబట్టి బీజేపీ నేతలు ఎక్కడ నోటికి పనిచెప్పాలి. ఎక్కడ నోటికి తాళం వేయాలనే విషయాన్ని నేర్చుకోవాలని, పార్టీ పనులను మాత్రం చూస్తే చాలునని అక్షింతలు వేశారు.