ఉత్తరప్రదేశ్లో మరో దారుణం చోటుచేసుకుంది. రూ.100 లంచం ఇవ్వలేదని ఇద్దరు యువకులను పోలీసులు దారుణంగా కొట్టి చంపేశారు. మెయిన్పురి జిల్లా చెక్ పోస్ట్ వద్ద ఈ దారుణం జరిగింది. ఆ వివరాలను పరిశీలిస్తే... దిలీప్ యాదవ్(22), పంకజ్ యాదవ్(24) ఇద్దరూ మరో ఇద్దరు కార్మికులతో కలిసి ఓ ట్రక్కులో ఇటుకలు తీసుకెళ్తున్నారు.
ఘిరోర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోస్మా చెక్ పోస్ట్ వద్ద పోలీసులు ఈ లారీని అడ్డుకున్నారు. లారీని విడిచి పెట్టాలంటే 100 రూపాయలు ఇవ్వాలని హెచ్చరించారు. అయితే దీనికి ఇద్దరు యువకులు ఒప్పుకోలేదు. దీంతో ఇద్దరి మధ్య పెద్ద వాగ్వాదం జరిగింది. చిన్నగా మొదలైన గొడవ పెద్దది కావడంతో కార్మికులు నెట్రాపాల్, రాధామోహన్ అక్కడి నుంచి ఉడాయించారు. దీంతో దిలీప్, పంకజ్లను పోలీసులు గొడ్డను బాధినట్టుబాదారు.
దెబ్బలకు తట్టుకోలేని వారిద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న గ్రామస్తులు.. బాధిత కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. అక్కడకొచ్చిన ఇద్దరు పోలీసులను చితకబాదారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఉన్నతాధికారులు పోలీసులపై కేసులు నమోదు చేశారు.
దీంతో స్పందించిన పోలీసు అధికారులు ఈ ఘటనలో ప్రమేయమున్నట్టుగా భావిస్తున్న హోంగార్డును, పదకొండు మంది పోలీసులను విధుల నుండి తొలగించారు. పోలీసులను చూసి పారిపోయి ఓ చెరువులో పడి దిలీప్, పంకజ్ మృతి చెందారని పోలీసులు కల్ల బొల్లి కబుర్లు చెప్పే ప్రయత్నం చేశారు. అయితే పోస్టుమార్టం రిపోర్టులో వారి ఒంటి పై గాయాలు ఉండడం.. గాయాల కారణంగానే వారు మృతి చెందినట్టు తేలడంతో పోలీసుల నిజరూపం బయటపడింది.