మద్యం సేవించి విమానంలో రచ్చ చేసిన ప్రయాణికులు

గురువారం, 23 మార్చి 2023 (13:19 IST)
మద్యం సేవించిన ఇద్దరు ప్రయాణికులు విమానంలో రచ్చ చేశారు. తోటి ప్రయాణికుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. దుర్భాషలాడారు. దుబాయ్ నుంచి ముంబైకు వస్తున్న విమానంలో బుధవారం ఈ ఘటన జరిగింది. ఈ విమానంలో ప్రయాణించిన దత్తాత్రేయ బాపార్‌దేకర్, జాన్ జార్జ్ డిసౌజా అనే ఇద్దరు ప్రయాణికులు మద్యం సేవించినట్టు తేలింది. 
 
వీరిద్దరూ గల్భ్ నుంచి వస్తూ అక్కడి డ్యూటీ షాపులో మద్యం కొనుగోలు చేశారు. ఆ తర్వాత విమానమెక్కిన తర్వాత అందులో మద్యం సేవించడం మొదలుపెట్టారు. దీనిపై తోటి ప్రయాణికులు అభ్యంతరం వ్యక్తం చేయగా, వారిపై నోరు పారేసుకున్నారు. అంతేకాకుండా నిందితుల్లో ఒకరు మద్యం బాటిల్ చేతిలో పట్టుకుని ఐల్‌లో నిర్లక్ష్యంగా నడుస్తూ తోటి ప్రయాణికులను తీవ్ర ఇబ్బంది పెట్టాడు. 
 
దీంతో విమానం సిబ్బంది ఆ వ్యక్తి చేతిలోని మద్యం బాటిల్‌ను బలవంతంగా తీసుకున్నారు. ఈ ఘటనపై క్రూ సిబ్బంది ఎయిర్ పోర్టు అధికారులకు సమాచారం అందించారు. విమానం ముంబైకు చేరుకోగానే ఆ ఇద్దరు ప్రయాణికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరిపై సెక్షన్ 336తో పాటు ఎయిర్ క్రాఫ్ట్ రూల్స్‌లోని 21, 22, 25 నిబంధనల కింద కేసు నమోదు చేశారు. 
 
ఇటీవలి కాలంలో ఇలాంటి ఘటనలు తరచుగా వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల తోటి ప్రయాణికులపై మూత్ర విసర్జన చేసిన సంఘటనలు జరిగిన విషయం తెల్సిందే. ఇలాంటి ఘటనలు ఇప్పటివరకు ఏడు జరిగాయి.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు