తెలంగాణ - ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దులోని బీజాపూర్ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలేలా చేశాయి. ఉసురు పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్రెగుట్ట కేంద్రంగా చేపట్టిన ఆపరేషన్లో మొత్తం 31 మంది మావోయిస్టులు మరణించినట్టు సీఆర్పీఎఫ్ డీజీపీ జీపీ సింగ్, ఛత్తీస్గఢ్ డీజీపీ అరుణ్ దేవ్ గౌతం ప్రకటించారు. ఈ ఆపరేషన్కు సంబంధించిన వివరాలను బుధవారం బీజాపూర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు వెల్లడించారు.
సుమారు 21 రోజులు పాటు సాగిన ఈ కీలక ఆపరేషన్లో మృతి చెందిన 31 మంది మావోయిస్టులలో 16 మంది మహిళలు ఉన్నారని అధికారులు తెలిపారు. హతమైన మావోయిస్టులపై ప్రభుత్వం గతంలో మొత్తం రూ.1.72 కోట్ల రివార్డును ప్రకటించిన పేర్కొన్నారు. ఈ ఎదురుకాల్పులు, ఆపరేషన్ క్రమంలో 18 మంది భద్రతా సిబ్బంది గాయపడినట్టు వెల్లడించారు. మరణించిన మావోయిస్టులలో ఇప్పటివరకు 20 మంది గుర్తించామని, మరో 11 మందిని గుర్తించాల్సి వుందని తెలిపారు. ఘటనా స్థలం నుంచి 35 అత్యాధునిక ఆయుధాలను కూడా భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు.