90 శాతం కేసులు ఆ 8 రాష్ట్రాల్లోనే... ఏం చేద్ధాం.. కేంద్రం ఆరా!!

శుక్రవారం, 10 జులై 2020 (12:05 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ఏమాత్రం తగ్గడం ఫలితంగా ప్రతి రోజూ 20 వేలకు తగ్గకుండా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ కేసుల్లో 90 శాతం కేసులు ప్రధానంగా ఎనిమిది రాష్ట్రాల్లోనే నమోదవుతున్నాయి. ఈ రాష్ట్రాల్లో మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, కర్నాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్‌లు ఉన్నాయి. 
 
గత కొన్ని రోజులుగా ఈ రాష్ట్రాల్లో కొత్త కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని, ఈ రాష్ట్రాల్లోని 49 జిల్లాలు కరోనా కేసులకు హాట్‌స్పాట్‌లుగా మారాయని కేంద్రం వెల్లడిస్తున్న గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అందుకే ఈ 49 జిల్లాలపై కేంద్ర ఆరోగ్య శాఖ ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించింది. ముఖ్యంగా, హైదరాబాద్, ముంబై, బెంగుళూరు, చెన్నై వంటి మహానగరాలపై కేంద్రం ప్రత్యేక దృష్టిసారించి, కోవిడ్ చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తోంది. 
 
ఇకపోతే, దేశంలో సంభవిస్తున్న కరోనా మరణాల విషయానికొస్తే, 86 శాతం మరణాలు ఆరు రాష్ట్రాల్లో నమోదవుతున్నాయని తెలుస్తోంది. మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో కరోనా మరణాలు అధికంగా ఉన్నాయి. పశ్చిమ బెంగాల్‌లో కేసుల సంఖ్య తక్కువగా ఉన్నా, మరణాల సంఖ్య అధికంగా ఉండటం ఇపుడు ఆందోళన కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు. 
 
కరోనా పరిస్థితులపై కేంద్ర మంత్రివర్గం 18వ భేటీ నిర్వహించగా, ఈ వివరాలను ఆరోగ్య మంత్రి హర్ష్ వర్ధన్ వెల్లడించారు. మరణాల రేటు అధికంగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిని సారించినట్టు ఆయన తెలిపారు. కరోనా కేసుల సంఖ్య అత్యధికంగా ఉన్న టాప్-5 దేశాలతో పోలిస్తే, ప్రతి 10 లక్షల మందిలో 1,452 కేసులు, 68.7 మరణాలు సంభవిస్తుండగా, దేశంలో ఇది 538 కేసులు, 15 మరణాలుగా మాత్రమే ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.
 
"సమీప భవిష్యత్తులో కొవిడ్-19ను కట్టడి చేసేందుకు మరిన్ని కఠిన కంటెయిన్మెంట్ నిబంధనలు, నిఘా, టెస్టింగ్ సామర్థ్యాన్ని పెంచడం, వంటి కార్యక్రమాలను చేపట్టనున్నాం. పెరుగుతున్న హాట్ స్పా‌ట్‌ల సంఖ్యను ఆరోగ్య సేతు వంటి యాప్‌లను మరింతగా ప్రోత్సహించడం ద్వారా తగ్గిస్తాం" అని హర్షవర్ధన్ వ్యాఖ్యానించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు