ఒకవైపు కరోనా.. మరోవైపు సైక్లోన్ ఎంఫాన్.. బెంగాల్‌లో బీభత్సం- 84మంది మృతి

గురువారం, 21 మే 2020 (19:32 IST)
cyclone
దేశ వ్యాప్తంగా కరోనా కలకలం రేపుతోంది. కరోనా వైరస్ బారినపడి మృతి చెందుతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. మరోవైపు సైక్లోన్ ఎంఫాన్ తన తీవ్రతను పశ్చిమ బెంగాల్ గడ్డపై చూపించింది. తుపాను తాకిడికి పశ్చిమబెంగాల్‌లో 84 మంది మృతి చెందారు. ఒడిశాలో తుపాను తీవ్రత కారణంగా ఇద్దరు మృతి చెందారు. భీకర గాలులు, భారీ వర్షాల కారణంగా కోల్‌కత్తా ఎయిర్‌పోర్ట్‌ పూర్తిగా నీట మునిగింది. బంగ్లాదేశ్‌లో 10 మంది మృతి చెందారు.  
 
ఇకపోతే.. ఎంఫాన్ తుపాను పశ్చిమ బెంగాల్‌లోని డిఘా, బంగ్లాదేశ్‌లోని హతియా దీవుల మధ్య సుందర్‌బన్స్‌కు సమీపంలో తీరం దాటింది. తీరం దాటే సమయంలో బెంగాల్, ఒడిశా ప్రాంతాల్లో గంటకు 155 నుంచి 165, అప్పుడప్పుడు 190 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచాయని అధికారులు తెలిపారు. పశ్చిమబెంగాల్‌, ఒడిశాల్లోని తీర ప్రాంత జిల్లాలపై ఆంఫన్‌ ప్రభావం భారీగా ఉందని ఐఎండీ పేర్కొంది. ఈ సైక్లోన్ ప్రభావంతో పెద్ద వృక్షాలు నేలకూలాయి. చాలాప్రాంతాల్లో విద్యుత్‌ స్తంభాలు విరిగిపోయాయి. దీంతో చీకటి అలముకుంది.
 
తన జీవితంలో ఇంతటి విధ్వంసాన్ని చూడలేదని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు. పరిస్థితిని అంచనా వేసేందుకు ప్రధానిని రాష్ట్రంలో స్వయంగా పర్యటించాలని కోరారు. మృతుల కుటుంబాలకు ఆమె రెండున్నర లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు