దేశంలో కీలక నిబంధనల్లో మార్పులు.. ఐటీఆర్, క్రెడిట్ కార్డులు, తత్కాల్‌ టిక్కెట్ల బుకింక్‌కు ఆధార్ లింక్...

ఠాగూర్

మంగళవారం, 1 జులై 2025 (08:56 IST)
దేశంలో జూలై ఒకటో తేదీ నుంచి పలు కీలక నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఆదాయపన్ను రిటర్నుల దాఖలు నుంచి క్రెడిట్ కార్డుల వినియోగం, రైల్వే తత్కాల్ టిక్కెట్ల బుకింగ్ వరకు అనేక అంశాల్లో చేసిన పలు మార్పులు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మార్పులు సామాన్య పన్ను చెల్లింపుదారులు, ఎస్బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ వంటి ప్రధాన బ్యాంకుల కస్టమర్లపై ప్రత్యక్ష ప్రభావం చూపనున్నాయి.
 
కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) నిబంధనల ప్రకారం, మంగళవారం నుంచి కొత్త పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలంటే ఆధార్ వివరాలను తప్పనిసరిగా ధృవీకరించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు డ్రైవింగ్ లైసెన్స్ లేదా జనన ధృవీకరణ పత్రం వంటి గుర్తింపు కార్డులతో పాన్ కార్డు పొందే వీలుండేది. ఇప్పటికే పాన్ కార్డు ఉన్నవారు ఈ ఏడాది డిసెంబర్ 31లోగా తమ ఆధార్ నంబరును అనుసంధానం చేసుకోవాలని సీబీడీటీ స్పష్టం చేసింది. ఈ నిబంధన పాటించని వారి పాన్ డి-యాక్టివేట్ అయ్యే ప్రమాదం ఉంది.
 
అలాగే, రైల్వే తత్కాల్ టికెట్లను బుక్ చేసుకోవాలన్నా ఆధార్ ధృవీకరణ తప్పనిసరి కానుంది. దీనితో పాటు, జూలై 15 నుంచి ఆన్‌లైన్ లేదా కౌంటర్లలో కొనుగోలు చేసే అన్ని రైలు టికెట్లకు టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఇందులో భాగంగా రిజిస్టర్డ్ మొబైల్ నంబరుకు వన్-టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ) వస్తుంది. మరోవైపు, రైలు టికెట్ ధరలను కూడా స్వల్పంగా  పెంచనున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు