రెండో పెళ్లికి ఒప్పుకోలేదని.. 60 ఏళ్ల వృద్ధుడు విద్యుత్ స్తంభం ఎక్కాడు..

బుధవారం, 10 మార్చి 2021 (19:04 IST)
పెళ్లికాని ప్రసాద్‌లు ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పెరిగిపోతున్నారు. అమ్మాయిలు దొరక్క అబ్బాయిలు చాలామంది లేటు వయసులోనూ మిగిలిపోతున్నారు. అయితే ఓ వృద్ధుడు రెండో పెళ్లికి రెడీ అయ్యాడు. రెండో పెండ్లికి కుటుంబం అభ్యంతరం చెప్పడంతో ఒక వృద్ధుడు ఆత్మహత్య చేసుకునేందుకు విద్యుత్‌ స్తంభం ఎక్కాడు. అయితే కరెంట్‌ తీగలు పట్టుకున్న సమయంలో విద్యుత్‌ సరఫరా లేకపోవడంతో అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. రాజస్థాన్‌లోని ధోల్పూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. 
 
వివరాల్లోకి వెళితే.. ధోల్పూర్‌కు చెందిన సోబ్రాన్ సింగ్ అనే 60 ఏళ్ల వ్యక్తి భార్య నాలుగేండ్ల కిందట చనిపోయింది. సంతానమైన ముగ్గురు మగ, ఇద్దరు ఆడ పిల్లలకు పెండ్లిండ్లు అయ్యాయి. వారికి పిల్లలు కూడా ఉన్నారు.
 
అయితే ఇటీవల రెండో పెండ్లి చేసుకుంటానని సోబ్రాన్‌ సింగ్‌ తన కుటుంబ సభ్యులకు చెప్పగా వారు అభ్యంతరం తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ నెల 7న ఆ వృద్ధుడు మరోసారి తన పిల్లల వద్ద ఈ విషయాన్ని ప్రస్తావించగా వారు మండిపడ్డారు. దీంతో సోబ్రాన్ సింగ్‌ ఇంటి నుంచి బయటకు వెళ్లి పొలంలోని ఒక విద్యుత్‌ స్తంభం ఎక్కాడు. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. అయితే ఆ సమయంలో విద్యుత్‌ సరఫరా లేదు.
 
మరోవైపు సోబ్రాన్ సింగ్‌ కుటుంబ సభ్యులు వెంటనే విద్యుత్‌ సిబ్బందిని అప్రమత్తం చేశారు. అనంతరం కుటుంబ సభ్యులు, స్థానికులు కలిసి నచ్చజెప్పడంతో ఎట్టకేలకు ఆ వృద్ధుడు విద్యుత్‌ స్తంభం నుంచి కిందకు దిగాడు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు