ఢిల్లీలో ముగ్గురు విద్యార్థుల మృతి.. అక్రమ కోచింగ్ సెంటర్లపై ఉక్కుపాదం... సీలు వేస్తున్న అధికారులు!!

వరుణ్

సోమవారం, 29 జులై 2024 (11:22 IST)
ఢిల్లీలో ఓ ఐఏఎస్ కోచింగ్ సెంటరులోకి వరద నీరు ప్రవేశించి ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై ఢిల్లీ మున్సిపల్ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. అక్రమంగా నడుస్తున్న కోచింగ్ సెంటర్లపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పటికే అనుమతులు లేకుండా నడుస్తున్న 13 కోచింగ్ సెంటర్లకు అధికారులు సీల్ వేశారు. నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్లలో కోచింగ్ సెంటర్లు నిర్వహించడం వల్లే నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. 
 
మరోవైపు ఈ దుర్ఘటనపై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఢిల్లీ మున్సిపాలిటీ కార్పొరేషన్ తక్షణమే చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని రుతూ ఓ ఎన్డీఓ పిటిషన్‌ను దాఖలు చేసింది. రావూస్ కోచింగ్ సెంటర్లో డ్రైనేజీ వ్యవస్థ, భద్రతా చర్యలు లేకపోవడం వల్లే ముగ్గురు విద్యార్థులు మృతి చెందినట్లు అధికారులు తేల్చారు. ఈ ఘటనలో నేరపూరిత హత్య, ఇతర అభియోగాల కింది అరెస్టయిన కోచింగ్ సెంటర్ యజమాని అభిషేక్ గుప్తా, సెంటర్ కోఆర్డినేటర్ దేశపాల్ సింగ్‌కు కోర్టు 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్ విధించింది.
 
పార్కింగ్, సరుకు నిల్వ పేరుతో అనుమతి తీసుకొని సెల్లారులో అక్రమంగా లైబ్రరీ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఈ విషయాన్ని నిందితుడు అభిషేక్ గుప్తా అంగీకరించినట్లు ఎఫ్ఆర్‌లో పోలీసులు నమోదు చేసినట్లు డీసీపీ ఎమ్ హర్షవర్ధన్ తెలిపారు. ప్రమాద సమయంలో 18 మందికి పైగా విద్యార్థులు లైబ్రరీలో ఉన్నట్లు పేర్కొన్నారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి, సెల్లార్ నుంచి రాకపోకలకు ఉన్న సింగిల్ బయోమెట్రిక్ ద్వారం, భారీగా వచ్చిన వర్షపు నీటి కారణంగా ఆ సమయంలో పనిచేయలేదన్న వార్తలపై విచారణ చేస్తామని చెప్పారు. ఆ సెల్లార్లో మురుగునీరు బయటకు వెళ్లే వ్యవస్థ కూడా లేదన్నారు.
 
కాగా, ఈ దుర్ఘటన తమను కలచివేసిందని, విచారణలో అధికారులకు పూర్తిస్థాయిలో సహకరిస్తామని రావూస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ ఓ ప్రకటన విడుదల చేసింది. మరోవైపు పరిపాలన నిర్లక్ష్యానికి ముగ్గురు విద్యార్థులు బలికావడం చాలా బాధాకరమని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లీకార్జున ఖర్గే ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని అన్నారు. దీనికి బాధ్యత వహిస్తూ ఢిల్లీ మంత్రి ఆతిశీ, స్థానిక ఎమ్మెల్యే రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. 

ఇదిలావుంటే, ఢిల్లీలో సివిల్స్‌ అభ్యర్థుల మృతి కేసులో మరో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఇప్పటివరకు మొత్తం ఏడుగురుని అరెస్టు చేశారు. అలాగే, 13 కోచింగ్‌ సెంటర్లను అధికారులు సీజ్ చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు