పన్నీర్‌సెల్వం‌కు ఎర్త్? చిన్నమ్మకు లైన్ క్లియర్... ప్రకటన విడుదల చేసిన తంబిదురై

సోమవారం, 2 జనవరి 2017 (13:31 IST)
తమిళనాట రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ముఖ్యమంత్రి పీఠంపై అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా పగ్గాలు స్వీకరించిన దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఇష్టసఖి శశికళ కూర్బోబెట్టేందుకు ఆ పార్టీలోని సీనియర్ నేతలు ఒక్కొక్కరు ఒక్కో విధంగా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం మంత్రివర్గంలోని మంత్రుల్లో ముగ్గురు మంత్రులు చిన్నమ్మ సీఎం కావాలంటూ తమ ఆకాంక్షను వ్యక్తం చేశారు.
 
ఈ నేపథ్యంలో ఆ పార్టీ సీనియర్ నేత, లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై కూడా చిన్నమ్మకు జై కొట్టారు. జయలలిత చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకుపోవడానికి చిన్నమ్మ శశికళే సరైన వ్యక్తి అంటూ సోమవారం నాలుగు పేజీల ప్రకటనలో తెలిపారు. పార్టీ ఒకరి చేతిలో, ప్రభుత్వం మరొకరి చేతిలో ఉంటే రెండు పవర్ సెంటర్లు ఉంటాయని... ఇది రాష్ట్ర అభివృద్ధికి మంచిది కాదని అభిప్రాయపడ్డారు. శశికళ వెంటనే ముఖ్యమంత్రి పదవిని చేపట్టాలని ప్రకటనలో విన్నవించారు. 
 
మరోవైపు, అన్నాడీఎంకే విడుదల చేసిన ప్రకటనపై ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఇంతవరకు స్పందించలేదు. కానీ, ఆయన వర్గీయులు మాత్రం సీఎంగా పన్నీర్‌సెల్వమే కొనసాగుతారంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో జరుగుతున్న అన్ని పరిణామాలను విపక్ష నేతలు నిశితంగా గమనిస్తున్నారు. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే ఆచితూచి అడుగులు వేస్తోంది. 

వెబ్దునియా పై చదవండి