మండిపోతున్న వేసవి ఎండలు... ట్రాఫిక్ పోలీసులకు ఏసీ హెల్మెట్లు!!

ఠాగూర్

మంగళవారం, 25 మార్చి 2025 (12:36 IST)
ట్రాఫిక్ విధులు నిర్వహించే పోలీసులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వేసవికాలంలో విధులు నిర్వహించాలంటే తలకు మించిన భారంగా మారింది. కొన్ని సందర్భల్లో వడదెబ్బ కారణంగా పలువురు ట్రాఫిక్ కానిస్టేబుల్స్ ప్రాణాలు కోల్పోయిన సందర్భాలూ లేకపోలేదు. ఈ నేపథ్యంలో గ్రేటర్ చెన్నై పోలీస్ కమిషనర్ ఆవడి కార్యాలయం శుభవార్త చెప్పింది. ఎండల్లో విధులు నిర్వహించే ట్రాఫిక్ పోలీసులకు ఏసీ హెల్మెట్లు అందజేసింది. ఈ హెల్మెట్లు మైనస్ 15 డిగ్రీల చల్లదనాన్ని, 10 డిగ్రీల వెచ్చదనాన్ని ఇచ్చేలా డిజైన్ చేశారు. వీటిని ధరించిన వారి మెడ కింది భాగం కన్నా తల భాగంలో మూడు రెట్లు చల్లదనాన్ని హెల్మెట్లు ఇస్తాయి. 
 
ఇదే అంశంపై ఆవడి నగర పోలీస్ కమిషనర్ శంకర్ మాట్లాడుతూ, ఈ హెల్మెట్లు వల్ల తలనొప్పి, అలసట వంటివి తగ్గుతాయన్నారు. ఏసీ ఆన్ చేసినపుడు హెల్మెట్‌లో కాస్త వైబ్రేషన్ వస్తుందని తెలిపారు. తమ పరిధిలో 334 మంది ట్రాఫిక్ కానిస్టేబుళ్లు పని చేస్తున్నారని, ప్రస్తుతం 50 మందికి ఈ తరహా హెల్మెట్లను అందజేసినట్టు తెలిపారు. వీటి పనితీరును పరిశీలించిన తర్వాత మిగిలిన వారికి కూడా ఏసీ హెల్మెట్లు ఇస్తామని ఆయన పేర్కొన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు