ఊబర్ క్యాబ్‌లో మహిళపై అత్యాచారం... ఏపీ వాసి అరెస్టు

గురువారం, 23 సెప్టెంబరు 2021 (07:07 IST)
దేశ ఐటీ రాజధాని బెంగుళూరులో ఊబర్ క్యాబ్‌లో ఓ మహిళపై అత్యాచారం జరిగింది. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడైన క్యాబ్ డ్రైవర్‌​ను అరెస్టు చేశారు. కర్ణాటకలో కలకలం రేపిన ఈ అంశాన్ని ప్రతిపక్షాలు అసెంబ్లీలోనూ లేవనెత్తాయి. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. 
 
జార్ఖండ్‌కు చెందిన ఓ మహిళ కొన్నేళ్లుగా బెంగళూరులోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. మంగళవారం రాత్రి ఆమె హెచ్‌ఎస్‌ఆర్ లే అవుట్‌లో ఉండే తన స్నేహితురాలి ఇంటికి పార్టీకి వెళ్లింది. పార్టీ అనంతరం మురుగేశ్ పాళ్యలోని తన ఇంటికి వెళ్లేందుకు బుధవారం తెల్లవారుజామున ఉబర్‌ క్యాబ్ బుక్ చేసింది. 
 
క్యాబ్‌లో తన ఇంటి సమీపానికి చేరుకున్నాక.. ఓ నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి డ్రైవర్ తనపై శారీరకంగా దాడి చేశాడని, అత్యాచారానికి పాల్పడ్డాడని ఆ మహిళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. తర్వాత తనను క్యాబ్‌లోనుంచి తోసేశాడని తెలిపింది. 
 
దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు క్యాబ్‌ డ్రైవర్‌ దేవరాజ్‌ను అరెస్టు చేశారు. అతడిని విచారిస్తున్నట్లు తెలిపారు. బాధిత మహిళ క్యాబ్‌ ఎక్కగానే నిద్రపోయిందని.. దీనిని అదునుగా తీసుకున్న నిందితుడు క్యాబ్​ను ఆమె ఇంటి సమీపంలోని ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. 
 
సమీప ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. డ్రైవర్ తన క్యాబ్​ను​ దాదాపు 20 నిమిషాల పాటు ఖాళీ ప్రదేశంలో నిలిపి ఉంచినట్లు గుర్తించారు. ఇతర ఆధారాలను సైతం సేకరించినట్లు తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు