శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్రకు మరోమారు బ్రేక్...

ఠాగూర్

బుధవారం, 11 జూన్ 2025 (08:53 IST)
భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్రకు మరోమారు బ్రేక్ పడింది. దీంతో యాక్సియం-4 మిషన్ ప్రయోగాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. రాకెట్ లిక్విడ్ ఆక్సిజన్ లీక్ కావడమే ఈ యాత్రకు బ్రేక్ పడింద. దీనికి మరమ్మతులు చేసిన తర్వాత అంతరిక్ష యాత్రపై కొత్త తేదీని ప్రకటించనున్నారు. 
 
యాక్సియం-4 మిషన్‌లో భాగంగా మరో ముగ్గురు వ్యోమగాములతో కలిసి ఆయన బుధవారం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి బయలుదేరాల్సివుండగా, ప్రయోగానికి ముందు సాంకేతిక సమస్య తలెత్తడంతో యాత్రను వాయిదా వేస్తున్నట్టు స్పేస్ ఎక్స్ సంస్థ వెల్లడించింది.
 
కాగా, ప్రయోగానికి సిద్ధం చేసిన ఫాల్కన్-9 రాకెట్‌లో లిక్విడ్ ఆక్సిజన్ లీక్ అయినట్టు స్పేస్‌ఎక్స్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. బూస్టర్ టెస్ట్ సమయంలో ఈ సమస్య తలెత్తినట్టు గుర్తించారు. లీకేజీ సమస్య పూర్తిగా పరిష్కరించి, అన్ని పరీక్షలు నిర్వహించిన తర్వాతే ప్రయోగాన్ని చేపట్టాలని శాస్త్రవేత్తలు నిర్ణయించారు. మరమ్మతు పనులకు కొంత సమయం పట్టే అవకాశం ఉందని, త్వరలోనే కొత్త ప్రయోగ తేదీని అధికారికంగా వెల్లడిస్తామని ప్రకటించింది. 
 
నిజానికి ఈ ప్రయోగం మంగళవారమే జరగాల్సివుంది. అయితే, ప్రయోగ కేంద్రం ఉన్న ఫ్లోరిడా ప్రాంతంలో వాతావరణం అనుకూలించకపోవడంతో దీనిని బుధవారానికి వాయిదా వేశారు. తాజాగా ఇపుడు సాంకేతిక కారణాలతో రెండోసారి ప్రయోగం వాయిదాపడింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు