హిందీ తెలియకుంటే సమావేశం నుంచి బయటకు వెళ్లిపోండి.. ఆయుష్ సెక్రటరీ...

శనివారం, 22 ఆగస్టు 2020 (13:49 IST)
భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వ హయాంలో ప్రాంతీయ భాషలను చిన్నచూపు చూస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. వివిధ శాఖల కార్యదర్శుల ప్రవర్తన కూడా అలానే వుంది. దీంతో హిందీ మినహా ఇతర భాషలు దేశంలో ఉండరాదన్న లక్ష్యంతో కేంద్రం వ్యవహారశైలివుందనే ఆరోపణలు వస్తున్నాయి. 
 
ఈ నేపథ్యంలో తాజాగా కేంద్ర ప్రభుత్వ ఆయుష్ విభాగం కార్యదర్శి రాజేశ్ కోటేచా ఆన్‌లైన్ సమావేశం నిర్వహించారు. అయితే, హిందీ రానివాళ్లు ఈ సమావేశం నుంచి వెళ్లిపోవచ్చని కోటేచా వ్యాఖ్యానించారు. ఈ విషయం బయటకు లీక్ కావడంతో తమిళ సంఘాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. 
 
తమిళులపై హిందీని ఉద్దేశపూర్వకంగా రుద్దే ప్రయత్నంలోనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని సంఘాల నేతలు మండిపడ్డారు. హిందీ భాష రాదంటూ తమిళులను ఇంకా ఎన్నాళ్లు అవమానిస్తారని నిలదీస్తున్నారు. 
 
ఈ వ్యవహారం పట్ల డీఎంకే ఎంపీ కనిమొళి కూడా స్పందించారు. ఆయుష్ కార్యదర్శి రాజేశ్ కోటేచా వ్యాఖ్యలపై కేంద్రం స్పందించాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. 
 
ఇటీవల కనిమొళికి విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే. ఎయిర్ పోర్టులో సీఐఎస్ఎఫ్ అధికారిణి కనిమొళితో మాట్లాడుతూ, "మీరసలు భారతీయులేనా?" అంటూ వ్యాఖ్యానించడం తీవ్ర విమర్శలకు దారితీసింది.
 
కాగా, తమిళ ప్రజలకు భాషాభిమానం నరనరాన జీర్ణించుకునిపోయింది. ఈ విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హిందీ భాషకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేసిన చరిత్ర వారిది. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి చేసిన వ్యాఖ్యలు తమిళుల్లో ఆగ్రహజ్వాలలు రగిల్చాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు