పెట్రోల్ కొంటే బిర్యానీ ఫ్రీ.. షరతులు వర్తిస్తాయ్... ఎక్కడ?

సోమవారం, 21 సెప్టెంబరు 2020 (18:16 IST)
పెట్రోల్ కొంటే బిర్యానీ ఫ్రీ.. ఈ బంపర్ ఆఫర్ ఎక్కడనే కదా మీ సందేహం. అదెక్కడో కాదు. ఐటీ క్యాపిటల్ బెంగుళూరులో. ఈ నగరంలోని ఓ పెట్రోల్ బంకు యాజమాన్యం వినియోగదారులకు ఈ వినూత్న ఆఫర్ ప్రకటించింది. సోమవారం నుంచి ఇంధనం నింపుకునే వినియోగదారులకు బిర్యానీ ఉచితంగా పంపిణీ చేయనున్నట్టు తెలిపింది. 
 
తమ సేవలు ప్రారంభించి 50 ఏళ్లు నిండిన సందర్భంగా వినియోగదారుల పట్ల కృతజ్ఞత చాటుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు శ్రీ వెంకటేశ్వర ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) సర్వీస్ స్టేషన్ నిర్వాహకులు వెల్లడించారు. ఓల్డ్ మద్రాసు రోడ్డులోని ఈ ఔట్‌లెట్‌లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య, సాయంత్రం 5 నుంచి 9 గంటల మధ్య కాంప్లిమెంటరీ ఫుడ్ ప్యాకెట్లు అందిస్తామని తెలిపారు. 
 
ఈ ఆఫర్ వచ్చే 30 రోజుల పాటు కొనసాగుతుందన్నారు. ఇందులో వెజ్, నాన్ వెజ్ వెరైటీలు ఉంటాయని తెలిపారు. అయితే ఫ్రీ బిర్యానీ అందించేందుకు ఈ ఫ్యూయల్ స్టేషన్ కొన్ని షరతులు కూడా పెట్టింది. వీటి ప్రకారం రూ.2 వేలు ఆపైన ఇంధనం నింపుకున్న వారికే బిర్యానీ ఫ్రీగా ఇస్తారు. దీంతో పాటు రూ.250 ఆపైన ఇంధనం నింపుకున్న వారికి కూడా ప్రోత్సాహక బహుమానాలు ఇవ్వనున్నారు. 
 
'51 సంవత్సరాల నుంచి మేము ఈ ఐవోసీ సర్వీస్ స్టేషన్ నిర్వహిస్తున్నాం. కర్నాటకలో అత్యధిక ఇంధన అమ్మకాలు చేస్తున్న రికార్డు కూడా మాకే దక్కింది. ఇన్నేళ్లుగా మమ్మల్ని ఆదరిస్తున్న వినియోగదారులకు కృతజ్ఞతలు చెప్పేందుకే ఈ ప్రయత్నం చేస్తున్నాం. నెలరోజుల పాటు ఈ ఆఫర్ కొనసాగిస్తాం. ఈ ఆఫర్ ముగిసిన తర్వాత వివిధ రకాల ఉత్పత్తులను 50 శాతం తక్కువ ధరకే విక్రయించాలని యోచిస్తున్నాం' అని సదరు పెట్రోల్ బంకు యజమాని చెప్పుకొచ్చారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు