బీహార్ రాష్ట్రంలో బీజేపీ - జేడీయూ మధ్య కొలిక్కి వచ్చిన సీట్ల పంపిణీ

ఠాగూర్

బుధవారం, 6 మార్చి 2024 (08:53 IST)
వచ్చే పార్లమెంట్ ఎన్నికల కోసం బీహార్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి పార్టీల మధ్య సీట్ల పంపిణీ కొలిక్కివచ్చింది. రాష్ట్రంలోని మొత్తం 40 సీట్లకుగాను బీజేపీ 17 స్థానాల్లో పోటీ చేయనుంది. అలాగే, నితీశ్ కుమార్ సారథ్యంలోని జేడీయూకు 14 సీట్లు, కేంద్ర మాజీ మంత్రి దివంగత రాం విలాస్ పాశ్వాన్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్, పశుపతి పరాస్‌లకు ఆరు సీట్లు ఇవ్వాలని బీజేపీ నిర్ణయించింది. అదేవిధంగా ఉపేంద్ర కుశ్వాహ, మాంఝీ పార్టీలకు ఒక్కో సీటు ఇవ్వనుంది. ఎన్డీయే భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల పంపకాలకు సంబంధించి చర్చించేందుకు బీజేపీ ఎన్నికల కమిటీ సమావేశం పాట్నాలో సమావేశమైంది.
 
ఈ సమావేశంలో బీజేపీ బీహార్ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి మాట్లాడుతూ... ఎన్నికల కమిటీ సమావేశం జరిగిందని, త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. తాము 17 సీట్లు తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలిపారు. 2019 లోక్ సభ ఎన్నికల సమయంలో జేడీయూ, చిరాగ్ పాశ్వాన్ మిత్రులుగా ఉన్నారు. ఇప్పుడు ఉపేంద్ర కుశ్వాహ నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ, జితిన్ రామ్ మాంఝీ నేతృత్వంలోని హిందుస్థానీ అవామీ మోర్చా, లోక్ జనశక్తి పార్టీకి చెందిన రెండు వర్గాలు ఎన్డీయే భాగస్వాములుగా ఉన్నాయి. 
 
ఏపీ మంత్రివర్గం నుంచి మంత్రి గుమ్మనూరు జయరాం బర్తరఫ్
 
అందరూ ఊహించిందే జరిగింది. ఏపీలో అధికార వైకాపాను వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన మంత్రి గుమ్మనూరు జయరాంను ఏపీ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశారు. ఈ మేరకు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆదేశాలు జారీచేశారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా కాకుండా ఎంపీగా పోటీ చేయాలని వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి.. మంత్రి జయరాంకు సూచించారు. కానీ, ఈ ప్రతిపాదన పట్ల మంత్రి జయరాం తీవ్ర అసంతృప్తితో కొనసాగుతూ, గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. 
 
అదేసమయంలో టీడీపీలో చేరేందుకు ఆయన తన వంతు ప్రయత్నాలు చేశారు. ఇవి ఫలించడంతో పసుపు కండువా కప్పుకున్నారు. మంగళవారం మంగళగిరి వేదికగా జరిగిన బీసీ సభలో ఆయన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గం నుంచి జయరాంను బర్తరఫ్ చేయాలని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గవర్నర్‌కు సిఫార్సు చేశారు. దీంతో గవర్నర్ అబ్దుల్ నజీర్ బర్తరఫ్ చేశారు. ఈ మేరకు రాజ్‌భవన్ నుంచి గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ అయింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు