అదనపు వడ్డీ ఇవ్వలేదనీ.. దళిత మహిళను వివస్త్రను చేసి... నోట్ల మూత్రం పోసి...

సోమవారం, 25 సెప్టెంబరు 2023 (13:38 IST)
బీహార్ రాష్ట్రంలో దారుణం జరిగింది. తీసుకున్న అప్పు తిరిగి చెల్లించిన ఓ దళిత మహిళ పట్ల వడ్డీవ్యాపారులు అమానుషంగా ప్రవర్తించారు. అదనపు వడ్డీ చెల్లించలేదన్న అక్కసుతో ఆమెను వివస్త్రను చేసి నోట్లో మూత్రం పోశారు. ఈ అమానుష ఘటన బీహార్ రాష్ట్రంలోని పాట్నాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
పాట్నా జిల్లాలోని మోసిముర్ గ్రామానికి చెందిన ఓ మహిళ భర్త.. స్థానికంగా పలుకుబడివున్న ప్రమోద్ సింగ్ అనే వ్యక్తి వద్ద కొన్ని నెలల క్రితం రూ.1500 అప్పుగా తీసుకున్నాడు. ఆ డబ్బును వడ్డీతో సహా తిరిగి చెల్లించాడు. అయినప్పటికీ అదనపు వడ్డీ కావాలంటూ ప్రమోద్ సింద్ వేధించ సాగాడు. దీనికి ఆ దంపతులు అంగీకరించలేదు. 
 
దీంతో ఆగ్రహించిన ప్రమోద్.. గతవారం ఆ దళిత మహిళకు ఫోన్ చేసి బెదిరించాడు. అదనపు వడ్డీ ఇవ్వకపోతే గ్రామంలో నగ్నంగా ఊరేగిస్తానని హెచ్చరించాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయం తెలుసుకున్న ప్రమోద్ గత శనివారం రాత్రి అతడి అనుచరులతో కలిసి మహిళ ఇంటికి వెళ్లాడు. ఆమెను బలవంతంగా తన ఇంటికి తీసుకెళ్లి ఆమెపై దాడి చేశాడు. 
 
మహిళను వివస్త్రను చేసి కర్రలతో కొట్టించాడు. అక్కడితో ఆగకుండా తన కుమారుడితో మహిళ నోట్లో మూత్రం పోయించాడు. అక్కడి నుంచి తప్పించుకున్న బాధిత మహిళ మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 
 
ప్రధాన నిందితులైన ప్రమోద్ సింగ్, అతడి కుమారుడు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపు చేపట్టినట్లు తెలిపారు. బాధిత మహిళ ప్రస్తుతం గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని, ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో పోలీసుల నిర్లక్ష్యంగా చూపడం వల్లే ఈ దారుణం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు