విడాకులు కావాలంటూ కోర్టుకెక్కిన భార్య... వినూత్నంగా ప్రతీకారం తీర్చుకున్న భర్త!

ఠాగూర్

ఆదివారం, 9 ఫిబ్రవరి 2025 (14:58 IST)
తన భర్త నుంచి తనకు విడాకులు ఇప్పించాలని కోరుతూ కోర్టుకు వెళ్లిన ఓ భార్యకు భర్త తగిన రీతిలో ప్రతీకారం తీర్చుకున్నాడు. ఆమె పేరుతో ఉన్న బైకులకు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినట్టు జరిమానాల భారం వేశాడు. ఈ ఆసక్తికర సంఘటన బీహార్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ వార్తకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది. 
 
బీహార్‌లోని ముజఫర్‌పూర్‌కు చెందిన యువతికి, బీహార్‌లోని పాట్నాకు చెందిన యువకుడికి వివాహం జరిగింది. అయితే పెళ్లి అయిన నెల రోజులకే వారి మధ్య విభేదాలు రావడంతో ఆ యువతి పుట్టింటికి వెళ్లిపోయింది. భర్తకు విడాకుల నోటీసుపంపింది. ప్రస్తుతం ఈ విడాకుల పిటిషన్ కోర్టులో పెండింగులో ఉంది. అయితే వివాహ సమయంలో ఆ యువకుడికి యువతి తల్లిదండ్రులు ఒక బైకు కానుకగా ఇచ్చారు. అయితే ఆ బైక్‌ను మాత్రం తన కుమార్తె పేరుతో రిజిస్ట్రేషన్ చేయించారు. ఆ యువతి పుట్టింటికి వెళ్లిపోయినా ఆ యువకుడు మాత్రం బైకుకు తిరిగి ఇవ్వలేదు. 
 
అతను ఆ బైకుపై తిరుగుతూ పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడ్డాడు. దీంతో ట్రాఫిక్ పోలీసులు ఆ బైకుకు సంబంధించి జరిమానా చలానాలను ఆ యువతికి పంపించారు. తన పేరు మీద బైక్ ఉండటంతో ఆమె తొలుత సమయం ప్రకారం చలానాలను కట్టేసింది. అయితే వరుసగా చలానాల భారం పెరుగుతుండటంతో భర్త కుట్ర అర్థమై ఆమె పోలీసులను ఆశ్రయించింది. 
 
గత మూడు నెలల్లోనే నాలుగు సార్లు చలానాలు వచ్చాయని ఆమె వాపోయింది. ఆ యువకుడు మాత్రం ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతూ భార్యను ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు. అంతేకాకుండా విడాకులు మంజూరు అయ్యే వరకూ బైక్ ఇచ్చేది లేదని ఆమెకు తేల్చి చెప్పాడు.
 
భర్త చేస్తున్న వేధింపులు తట్టుకోలేక ఆమె తొలుత పాట్నా ట్రాఫిక్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే స్థానిక పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేయాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. దీంతో ఆమె తండ్రితో కలిసి తమ స్వస్థలంలోని పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేసింది. 
 
అయితే, భర్తే బైక్ నడుపుతూ ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నట్లు ఒక అఫిడవిట్ సమర్పించాలని పోలీసులు ఆమెకు సూచించారు. భార్యను వేధించేందుకు భర్త చేస్తున్న ఈ వింత రివేంజ్ ప్లాన్‌పై నెటిజన్లు రకరకాలుగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు