మా పార్టీ నిర్ణయంతో బీజేపీకే లాభం.. ఎంఐఎం బెంగాల్ నేత సంచలన వ్యాఖ్యలు

మంగళవారం, 24 నవంబరు 2020 (08:13 IST)
బెంగాల్ ఎన్నికలకు సిద్ధమవుతున్న ఏఐఎంఐఎం పార్టీకి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ రాష్ట్ర విభాగానికి చెందిన నేత షాయిక్ అన్వర్ హుస్సేన్ పాషా.. తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఎంఐఎం చీలిక రాజకీయాలు బీజేపీకి లాభాన్ని చేకూరుస్తున్నాయని, బిహార్ అసెంబ్లీలో అదే జరిగిందని పాషా చెప్పుకొచ్చారు. అంతే కాకుండా బెంగాల్‌కు ఎంఐఎం అధినేత ఓవైసీ రావద్దంటూ పాషా తెలిపారు.
 
‘‘బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం చీలిక రాజకీయాలు బీజేపీ అభివృద్ధికి తోడ్పడ్డాయి. ఎంఐఎం అక్కడ పోటీ చేయకపోతే పరిస్థితి ఇంకోలా ఉండేది. మరికొద్ది రోజుల్లో బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఎంఐఎం ఇక్కడ పోటీ చేస్తే.. ఇక్కడ కూడా బిహార్ లాంటి ఫలితాలే వస్తాయి.

బెంగాల్‌లో మైనారిటీ జనాభా 70 శాతం. నిజానికి ఇది కీలక ఓటు బ్యాంక్ కూడా. ఈ ఓటు బ్యాంకుతో ఫలితాలు ఏ విధంగానైనా మారొచ్చు’’ అని పాషా అన్నారు.
 
‘‘బెంగాల్‌లో అన్ని మతాల వారు సామరస్యంగా జీవిస్తున్నారు. బీజేపీ లాంటి పార్టీ ఇక్కడ అడుగుపెడితే పరిస్థితులు మారిపోతాయి. అలా జరగకూడదంటే బీజేపీని ఇక్కడ గెలవనీయకూడదు. బీజేపీని నిలువరించే ఏకైక పార్టీ టీఎంసీనే. మమతా బెనర్జీ చాలా గొప్ప సెక్యూలర్ నేత. సీఏఏ, ఎన్‌ఆర్‌సీలకు వ్యతిరేకంగా ఆమె బలమైన గొంతుక వినిపించారు.

నా జీవితంలో ఇంత గొప్ప సెక్యూలర్ నేతను చూడలేదు. బెంగాల్ ప్రశాంతంగా ఉండాలంటే మళ్లీ టీఎంసీనే గెలవాలి. అందుకే నేను ఎంఐఎం పార్టీ వీడి టీఎంసీలో చేరాను. ఓవైసీని నేను ఒకటే అభ్యర్థిస్తున్నాను. దయచేసి బెంగాల్‌కు రావద్దు’’ అని పాషా చెప్పుకొచ్చారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు