బలవంతులు అనే ముద్రకు నష్టంవాటిల్లింది : బీజేపీ ఎంపీ స్వామి

బుధవారం, 27 జనవరి 2021 (14:04 IST)
ఇప్పటివరకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షాలకు అత్యంత బలవంతులు అనే ముద్ర పడింది. కానీ, ఢిల్లీలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా జరిగిన హింసతో బలవంతులు అనే పదానికి నష్టంవాటిల్లిందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి అభిప్రాయపడ్డారు. 
 
గణతంత్ర వేడుకల సందర్భంగా ఢిల్లీలో రైతులు చేపట్టిన ర్యాలీ హింసాత్మకంగా మారిన విషయం తెల్సిందే. దీనిపై స్వామి స్పందించారు. తన ట్విట్టర్  ఖాతాలో ఆయన వరుస ట్వీట్లు చేశారు. బీజేపీ నేతలు ఇకనైనా ‘‘మేలుకోవాలంటూ’’ అంటూ పిలుపునిచ్చారు. 
 
ట్రాక్టర్ పరేడ్‌తో ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాలపై ఉన్న ‘‘బలవంతులు’’ అనే ముద్రకు నష్టం వాటిల్లిందన్నారు. ‘‘రైతుల ఆందోళన కారణంగా ప్రధానంగా ఇద్దరు భాగస్వాముల గౌరవం దెబ్బతిన్నది. ఒకటి, పంజాబ్ కాంగ్రెస్, అకాలీ రాజకీయ నేతలు, వారి మధ్యవర్తులు. రెండోది, మోదీ- షా ‘‘బలవంతులు’’ అనే ముద్ర. లాభపడింది ఎవరు అంటే.. నక్సలైట్లు, డ్రగ్స్ ముఠాలు, ఐఎస్ఐ, ఖలిస్తానీలు. దయచేసి ఇకనైనా బీజేపీ మేలుకోవాలి..’’ అని స్వామి ట్వీట్ చేశారు.
 
ఢిల్లీలో శాంతి భద్రతల ‘‘వైఫల్యం’’పైనా స్వామి విమర్శలు సంధించారు. గణతంత్ర దినోత్సవ వేడుకలను నిలిపివేయాలని తాను ముందుగానే అనేక మార్లు కేంద్రాన్ని కోరానని ఆయన గుర్తుచేశారు. ‘‘భారత్‌ను మరింత బలహీనం చేసేందుకు ఈ మార్చి- మేలో చైనా భారీ దాడి చేయవచ్చు. హిందువులను ముట్టడి వేశారు జాగ్రత్త.. ఇకనైనా మేలుకొండి..’’ అని ఆయన హెచ్చరించారు. 
 
కాగా, రైతుల ఆందోళన కారణంగా ఈ ఏడాది గణతంత్ర వేడుకలు రసాభాసగా మారిన విషయం తెలిసిందే. కేంద్రం తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ రెండు నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులు... ట్రాక్టర్ పరేడ్ పేరుతో తాజాగా ఢిల్లీ పురవీధుల్లోకి దూసుకెళ్లడంతో ఇక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు