అశోక్ గెహ్లాట్ ప్రశంసలు కుట్రపూరితం : వసుంధరా రాజే

సోమవారం, 8 మే 2023 (14:13 IST)
రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ మహిళా నేత వసుంధర రాజే 2020లో తన ప్రభుత్వం కూలిపోకుండా ఆదుకున్నారని రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాత్‌ చేసిన వ్యాఖ్యలు రాజకీయ విమర్శలకు దారితీశాయి. వీటిని వసుంధర రాజే తీవ్రంగా ఖండించారు. ఆయన మాటలు కుట్రపూరితంగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
2020 జులైలో అప్పటి ఉపముఖ్యమంత్రి సచిన్‌ పైలట్‌, మరో 18 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు గెహ్లాట్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. ఆ సమయంలో వసుంధర రాజే, భాజపాకు చెందిన మాజీ స్పీకర్‌ కైలాస్‌ మేఘావాల్‌, ఎమ్మెల్యే శోభారాణి కుశ్వాహ్‌ తనకు అనుకూలంగా వ్యవహరించారని తెలిపారు. 
 
తన ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు చేపట్టిన భాజపా అధిష్ఠానం యత్నాలను వారు ముగ్గురూ వ్యతిరేకించారన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, గజేంద్ర సింగ్‌ షెకావత్‌, ధర్మేంద్ర ప్రధాన్‌ తన ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కుట్రపన్నారని గెహ్లాత్‌ ఆరోపించారు. వారు ఎమ్మెల్యేలకు డబ్బులు పంచారన్నారు. ఈ వ్యాఖ్యలను రాజే తీవ్రంగా ఖండించారు. 
 
'2023 ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో అశోక్ గెహ్లాట్ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాపై నిందలు వేశారు. కానీ ఆయన నిజాయతీ, చిత్త శుద్ధి అందరికీ తెలుసు. గెహ్లాట్ నన్ను ప్రశంసించడం.. నాపై పన్నిన పెద్ద కుట్ర. ఇప్పటివరకూ నా జీవితంలో గెహ్లాట్ మాదిరిగా నన్ను ఎవరూ అవమానించలేదు' అని మండిపడ్డారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు