తెల్లవారితే పెళ్లి.. ఇంతలోనే వరుడిని కరోనా పొట్టనబెట్టుకుంది.. ఎక్కడ?

గురువారం, 6 ఆగస్టు 2020 (19:27 IST)
కరోనా వైరస్ అన్నీ వర్గాల ప్రజలను ఆవహిస్తోంది. పేద ధనిక వర్గాలనే తేడా లేకుండా కరోనా సోకుతోంది. ఫలితంగా ఆందోళనే మిగులుతోంది. తాజాగా కాసేపట్లో పెళ్లి జరగాల్సిన ఓ వరుడిని కరోనా బలి తీసుకుంది. పచ్చని పందిట్లో కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకున్న ఆ యువకుడిని కరోనా పొట్టనబెట్టుకుంది. ఈ విషాధ ఘటన కర్నూలు జిల్లాలోని ఆదోనిలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. ఆదోనిలోని 11వ వార్డుకు చెందిన 28 ఏళ్ల యువకుడు గతనెల 28న తీవ్ర జ్వరం బారినపడ్డాడు. దీంతో స్థానికంగా ఉండే ఏఎన్‌ఎంను సంప్రదించాడు. ఎందుకైనా మంచిదని ఆమె కరోనా పరీక్షలు నిర్వహించడానికి నమూనాలు సేకరించారు. 
 
ఇంతలో యువకుడి ఆరోగ్యం మరింత క్షీణించింది. అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి సదరు యువకుడు మృతి చెందాడు. 
 
తెల్లవారితే పెళ్లి, మరికొన్ని గంటల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సినవాడిని కరోనా అన్యాయంగా బలి తీసుకుంది. అతని మృతితో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. కాగా, మృతుడికి ఇటీవలే పెళ్లి కుదిరింది. బుధవారమే పెళ్లి చేయాలని పెద్దలు నిశ్చయించారు. ఇంతలోనే ఘోరం జరిగిపోయింది.

 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు